ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు డ్వాక్రా సంఘాలను అధ్వాన్న స్ధితిలోకి నెట్టేశారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 11:04 AM

ఎన్నికల్లో డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు... తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి టోకరా వేశారని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. గతేడాది కంటే ఈ దఫా ఏకంగా రూ.16,600 కోట్ల రుణాల్లో కోత పెట్టడం ద్వారా డ్వాక్రా సంఘాలను అధ్వాన్న స్ధితిలోకి నెట్టారని ఆక్షేపించారు. విశాఖపట్నంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... నాబార్డు నివేదికతో నారా వారి వంచన బట్టబయలైందని ఇది ముమ్మూటికీ మహిళా సంఘాలను మోసం చేయడమేనని తేల్చి చెప్పారు.  సున్నావడ్డీ పథకానికి గుండు సున్నా చుట్టిన చంద్రబాబు మోసంతో గతంలోనే డ్వాక్రా సంఘాలు కుదేలవగా... వైయస్.జగన్ హయాంలో ఆసరా పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ. .25,500 కోట్లు మహిళల అకౌంట్లలో జమ చేసి వాటికి పునరుజ్జీవం పోశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్రాంతి పేరుతో మహిళలు తలదించుకునేలా అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై తీవ్రంగా మండిపడ్డ వరుదు కల్యాణి.. ఇది కూటమి పాలన కాదని  కేసినో పాలన అని తేల్చి చెప్పారు. సంక్రాంతి పేరుతో రికార్డింగ్ డ్యాన్సులు, పేకాట క్లబ్బులు కూటమి నేతల ఆధ్వర్యంలో జరుగుతుంటే... మరోవైపు హోంమంత్రి  అనిత మాత్రం సెటిల్‌మెంట్లలో బిజీ గా ఉన్నారని మండిపడ్డారు.టీడీపీనేతలపై కేసులు నమోదు చేసి ఎందుకు, రోడ్లపై నడిపించడం లేదని నిలదీశారు. అసభ్య నృత్యాలను, పేకాటను అడ్డుకోవాల్సిన పోలీసులు కాపలా కాయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పండగ పేరుతో  మద్యం ఏరులై పారిస్తూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa