అనకాపల్లి జిల్లా రోలుగుంటలో భారీ మోసం బయటపడింది. ఓ మహిళకు డీఎస్సీ ద్వారా ఎస్జీటీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. మహిళ నుంచి విడతలవారీగా రూ.12.30 లక్షలు వసూలు చేశారు. మహిళలను మోసం చేసే క్రమంలో తమకు సీఎం పేషీ ఉన్నతాధికారులు తెలుసని నమ్మబలికారు. ఇందుకోసం చంద్రబాబు వాయిస్తో ఫేక్ ఆడియో క్లిప్ కూడా తయారు చేసి పంపించారు. నారా లోకేష్ పీఎ తమకు తెలుసంటూ అబద్ధాలు చెప్పారు. దీంతో పాపం ఆ మహిళ 12 లక్షల 30 వేలు సమర్పించుకుంది. అయితే ఆ తర్వాత మోసపోయిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ వివరాలను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
" రోలుగుంట మండలానికి చెందిన ఓ మహిళ డీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే బంధువుల ద్వారా ఓ వ్యక్తి ఆమెను సంప్రందించాడు. ముఖ్యమంత్రి పేషీలోని ఉన్నతాధికారులు తనకు పరిచయం ఉన్నారని, 15 లక్షలు ఇస్తే ఎస్జీటీ పోస్టు ఇప్పిస్తామని చెప్పాడు. నమ్మకం పెంచుకునేందుకు, ఆమెకు ఓ ఫేక్ ఆడియో క్లిప్ పంపించారు. యూట్యూబ్ వీడియోలు, ఇతర సోర్సుల నుంచి చంద్రబాబు మాట్లాడిన క్లిప్పులను సేకరించి, వాటిని ఎడిట్ చేసి, ఓ నకిలీ ఆడియో క్లిప్ తయారు చేశారు. ఓ ఉచిత సాఫ్ట్వేర్ సాయంతో ఆ వాయిస్ క్లిప్ తయారు చేసి ఆమెకు పంపించారు. అది విన్న తర్వాత ఆ మహిళకు నమ్మకం కలిగింది. దీంతో వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి వారికి రూ.10 లక్షలు పంపించారు. "
" అయితే వాళ్లు మళ్లీ రూ.5 లక్షలు అడిగారు. ఆ మహిళకు మరింత నమ్మకం కలిగించేందుకు ఓ కాన్ఫరెన్స్ కాల్ కూడా ఏర్పాటు చేశారు. నారా లోకేష్ పీఎ భార్గవ్ చౌదరి అంటూ ఓ నకిలీ వ్యక్తిని పరిచయం చేసి.. ఆమెతో మాట్లాడించారు. దీంతో ఆ మహిళకు నమ్మకం కలిగి.. ఆ తర్వాత ఆమె మరో 2.30 లక్షలు పంపించారు. ఆ తర్వాత తాను మోసపోయిన సంగతి మహిళకు తెలిసింది. దీంతో రోలుగుంట పోలీసులను సంప్రదించారు. మహిళ ఫిర్యాదుతో దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపాం.ఇద్దరిని అరెస్ట్ చేశాం.
" ప్రకాశం జిల్లా ముండలమూరుకు చెందిన శ్రీను, విజయవాడకు చెందిన సలీం అనే ఇద్దరిని అరెస్ట్ చేశాం. గతంలోనూ వీరు లైన్మెన్, ఎస్ఐ జాబులు ఇప్పిస్తామని మోసం చేసినట్లు గుర్తించాం. నిరుద్యోగ యువత ఇలాంటి నకిలీ వ్యక్తులను నమ్మి మోసపోవద్దు. ఉద్యోగాలు ఏవైనా ప్రతిభ, పరీక్షల ద్వారా ఉంటాయి కానీ డబ్బులతో కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మోసాల గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయండి " అని ఎస్పీ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa