ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి.. కుటుంబానికి మంచి పేరు తేవాలని కలలు కన్న ఓ భారతీయ యువకుడు ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కానీ కన్న కలల కంటే డబ్బుపై ఆశ ఎక్కువ అయింది. ఈక్రమంలోనే ఓ మోసానికి తెరలేపాడు. ఐటీ విద్యార్థిగా ఉంటూనే.. టెక్నాలజీని ఉపయోగించిన ఓ న్యాయవాది అవతారం ఎత్తాడు. అమాయక ఆస్తి కొనుగోలు దారు నుంచి ఏకంగా 2.09 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.33 కోట్లు) కాజేశాడు. ఈ అసాధారణ లాయర్ స్కామ్ వెలుగులోకి రావడంతో.. సదరు విద్యార్థికి రెండేళ్ల జైలుశిక్ష పడింది.
టెక్నాలజీతో పక్కా ప్లాన్..
ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసాపై ఉంటున్న ప్రదీప్.. పార్ట్ టైమ్గా ఉబెర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా 2024 అక్టోబర్లో సిడ్నీలోని ఒక ప్రముఖ లా ఫర్మ్ ద్వారా ఇల్లు కొనుగోలు చేస్తున్న ఒక క్లయింట్ సమాచారాన్ని ప్రదీప్ తస్కరించాడు. వెంటనే ఆ లా ఫర్మ్ వెబ్సైట్ను పోలిన డొమైన్ పేరును రిజిస్టర్ చేశాడు. అసలు న్యాయవాది ఈమెయిల్ అడ్రస్, డిజిటల్ సంతకాన్ని అచ్చుగుద్దినట్లుగా సృష్టించి బాధితుడిని నమ్మించాడు. తద్వారా ఒక నకిలీ కంపెనీని ఏర్పాటు చేసి వెస్ట్పాక్ బ్యాంక్లో బిజినెస్ ఖాతాను కూడా తెరిచాడు.
కొన్ని వారాల పాటు బాధితుడితో నిరంతరం ఈమెయిల్స్ ద్వారా టచ్లో ఉన్న ప్రదీప్.. ఇల్లు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ పేరుతో నవంబర్ 13వ తేదీన తన ఖాతాకు 2.09 లక్షల డాలర్లు బదిలీ చేయించుకున్నాడు. వారం తర్వాత బాధితుడు అసలు లా ఫర్మ్ను సంప్రదించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అప్పటికే ప్రదీప్ ఆ డబ్బుతో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి.. వాటితో సెల్ఫీలు దిగడం గమనార్హం. మరోవైపు మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
కోర్టులో వీడిన గుట్టు
నిందితుడి తరపు న్యాయవాది ఇక్బాల్ ఖాన్ కోర్టులో వాదిస్తూ.. ప్రదీప్ కేవలం వేరొకరి మాటలు విని ఇలా చేశాడని, అతనికి తెలియకుండానే డబ్బు వచ్చిందని పేర్కొన్నారు. అయితే ప్రాసిక్యూటర్లు ఈ వాదనను తోసిపుచ్చారు. ప్రదీప్ స్వయంగా కంపెనీ డైరెక్టర్గా సంతకం చేశాడని, పథకం ప్రకారం ఈమెయిల్స్ పంపాడని ఆధారాలు చూపారు. పోలీసులు నిందితుడిని ప్రశ్నించినప్పుడు అది తన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అని అబద్ధం చెప్పడం అతని నేరపూరిత ఆలోచన బయటపడింది.
కఠిన శిక్ష.. ఇక దేశ బహిష్కరణే
ఈ కేసును విచారించిన మెజిస్ట్రేట్ ఆండ్రూ మిల్లర్.. నిందితుడి చర్యలు అత్యంత ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మోసపూరిత పద్ధతిలో ఆస్తిని పొందడం, నేరపూరిత సొమ్ముతో లావాదేవీలు జరిపినందుకు ప్రదీప్కు గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించారు. కనీసం 14 నెలల పాటు పెరోల్ లేకుండా జైలులో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే 1,00,000 డాలర్ల జరిమానాను పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. శిక్షా కాలం ముగియగానే ప్రదీప్ను ఆస్ట్రేలియా నుంచి భారత్కు బహిష్కరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa