తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన ఆప్తమిత్రురాలి జయంతి రోజైన ఫిబ్రవరి 24న పార్టీ పేరు, జెండా, విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ మేరకు ఆమె తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు.2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా శశికళ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా చెన్నైలోని తన నివాసంలో జిల్లా స్థాయి నేతలు, అనుచరులతో వరుసగా సమావేశమవుతున్నారు. ఈ నెల 18వ తేదీ వరకు ఈ చర్చలు కొనసాగనున్నాయి. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వం పనిచేయడం లేదని, అందుకే ఎన్నికల బరిలో దిగి మన ఉనికిని చాటాలని మద్దతుదారులు శశికళపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.ఈ సమావేశాల్లో కొత్త పార్టీని స్థాపించడమా లేక తన సోదరుడు 2018లో రిజిస్టర్ చేసిన 'అన్నా ద్రావిడర్ కళగం' తరఫున అభ్యర్థులను నిలబెట్టడమా అనే అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, దక్షిణ తమిళనాడులోని సుమారు 40 నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే, అక్రమాస్తుల కేసులో శిక్ష పడటంతో శశికళ 2027 వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలు. అయినప్పటికీ, ఆమె ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడానికి చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవు. సమావేశాలు ముగిసిన తర్వాత, జయలలిత జయంతికి ముందే శశికళ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa