పశ్చిమ బెంగాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ ఈసారి ఎలాగైనా సరే బెంగాల్లో పాగా వేయాలనే పట్టుదలతో ఉంది. దీదీ సైతం నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి 58 లక్షల మందిని తొలగించారంటూ ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన ఆమె.. అత్యున్నత న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. ఇప్పుడు బెంగాల్లోని యువతను ఆకట్టుకునేందుకు యువ సాథీ అనే పథకాన్ని దీదీ ప్రారంభించారు.
యువ సాథీ అంటే మరేంటో కాదు.. మన తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ‘నిరుద్యోగ భృతి’ ఇస్తామని హామీ ఇచ్చాయి కదా. అలాంటిదే ఈ యువ సాథీ కూడా. 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సాయం చేయడం ఈ పథకం ఉద్దేశం. మెట్రిక్యులేషన్ (పదోతరగతి) లేదా దానికి సమాన విద్యార్హత ఉంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నగదు సాయాన్ని ఏప్రిల్ 1 నుంచి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని టీఎంసీ హామీ ఇచ్చింది. అయితే అప్పటికే బెంగాల్లో ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2018లో ముఖ్యమంత్రి యువనేస్తం పేరిట ఈ పథకాన్ని అమలు చేశారు. మొదట్లో నెలకు రూ.1000 చొప్పున సాయం చేయగా.. ఆ తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఈ పథకం ఆగిపోయింది. 2024 ఎన్నికల్లోనూ టీడీపీ కూటమి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈ పథకం ఇంకా అమలు చేయకపోవడం పట్ల ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది.
తెలంగాణలో రెండు పార్టీలు యువతకు నిరుద్యోగ భృతి హామీలు ఇచ్చాయి. కేసీఆర్ సారథ్యంలోని గులాబీ పార్టీ 2018 ఎన్నికల్లో తాము గెలిస్తే నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇది అమలు కాలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సైతం ప్రతి నెలా రూ.4 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. కానీ ఈ హమీ సైతం అమలుకు నోచుకోలేదు.
తెలంగాణలో రాజకీయ పార్టీలు ఈ హామీని అమలు చేయలేకపోయాయి. టీడీపీ కూడా 2014లో హామీ ఇస్తే 2018కి గానీ పథకాన్ని ప్రారంభించలేకపోయింది. అయితే నిరుద్యోగ భృతి హామీతో తెలుగునాట రాజకీయ పార్టీలు అధికారంలోకి మాత్రం రాగలిగాయి. ఇప్పుడు బెంగాల్ మమతా బెనర్జీ ఎన్నికల ముంగిట యువ సాథీ పేరిట పథకమే ప్రారంభించారు. మరి యువ సాథీ సాయంతో దీదీ నాలుగోసారి అధికారంలోకి వస్తుందా లేదంటే యువత బీజేపీ వైపు మళ్లుతుందా అనేది త్వరలోనే తేలనుంది.
వాస్తవానికి నిరుద్యోగ భృతి హామీ ఇవ్వడం అనేది మన దేశంలో బెంగాల్లోనే మొదలైంది. 1978లోనే జ్యోతి బసు సారథ్యంలోని సీపీఐ(ఎం) దేశంలో తొలిసారిగా ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత మెల్లగా ఇతర రాష్ట్రాలు ఈ హామీని ఇవ్వడం మొదలుపెట్టాయి.
బెంగాల్లో భారీ క్యూ లైన్లు..
యువ సాథీ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి బెంగాల్ యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు కేంద్రాల ముందు బారులు తీరారు. వీరిలో గ్రాడ్యుయేట్లతోపాటు పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నారు. ప్రభుత్వం పట్ల యువతలో నమ్మకం ఉందని.. అందుకే ఈ పథకానికి రిజిస్టర్ కోసం భారీ సంఖ్యలో గుమికూడుతున్నారని టీఎంసీ సీనియర్ నేత శశి పంజా తెలిపారు.
పొలిటికల్ గిమ్మిక్కులు..
అయితే యువ సాథీ అనేది మరో పొలిటికల్ గిమ్మిక్కి అని బీజేపీ బెంగాల్ సీఎం అభ్యర్థి సువేందు అధికారి ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో టీఎంసీ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని.. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడం ద్వారా.. ప్రయివేట్ రంగంలో ఉపాధి అవకాశాలు లభించకుండా చేసిందని అధికార టీఎంసీపై సువేందు మండిపడ్డారు.
యువ శ్రీ పేరిట ఇంతకు ముందే అమలు..
2013లోనూ యువ శ్రీ పేరిట టీఎంసీ ఇలాంటి పథకాన్నే ప్రవేశపెట్టిందని.. అయితే 17 లక్షల మంది యువత ఈ పథకానికి రిజిస్టర్ చేసుకుంటే, కేవలం లక్ష మందికే ఆర్థిక సాయం అందించారని సువేందు అధికారి ఆరోపించారు. బెంగాల్ యువత ఆర్థిక సాయం కోరడం లేదు.. వారు ఉద్యోగాలు కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే యువ శ్రీ పథకం కింద 12 లక్షల మందికిపైగా ఆర్థిక సాయం అందించామని టీఎంసీ నేత, ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa