ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శబరిమలలో మహిళలకు ప్రవేశం కేసు,,, ఏప్రిల్ 7 నుంచే విచారణ

national |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 11:19 PM

కేరళలోని పత్తనంథిట్టా జిల్లాలో ఉన్న శబరిమల శ్రీఅయ్యప్ప స్వామి ఆలయంలో మహిళలకు ప్రవేశం అంశం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. మహిళల ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏప్రిల్ 7 నుంచి సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇందుకోసం మొత్తం 9 మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత రాజ్యాంగం ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది. అయ్యప్ప సన్నిధానంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 1991లో కేరళ హైకోర్టు దీనిని చట్టబద్దం చేయగా.. 2006లో యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసి, ఇది రాజ్యాంగ విరుద్దమని వాదించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2018లో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.


ఈ తీర్పుపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రివ్యూ పిటిషన్‌కు అనుమతించింది. చివరకు ఈ అంశాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాససానికి బదిలీ చేస్తున్నట్టు 2019న ఫిబ్రవరి 14న సుప్రీంకోర్టు ప్రకటించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత హరిహరపుత్రుడు శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశ వివాదంపై విచారణ చేపట్టనుంది. సంబంధిత పార్టీలు మార్చి 14లో తమ వాదనలను సమర్పించాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7న ఉదయం 10 గంటల నుంచి రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుందని ప్రకటించింది. రెండు వారాల పాటు ఏప్రిల్ 22 వరకూ విచారణకు సమయం కేటాయిస్తున్నట్టు తెలిపింది.


‘‘రివ్యూ పిటిషనర్లు, వారికి మద్దతిచ్చే పార్టీల వాదనలను ఏప్రిల్ 7 నుంచి 9 వరకూ.. వ్యతిరేకించే వారి పిటిషన్లను ఏప్రిల్ 14 నుంచి 16 వరకూ వింటాం’ అని సుప్రీంకోర్టు తెలిపింది. రిజాయిండర్ సబ్మిషన్లు ఉంటే 21న వింటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, రివ్యూ పిటిషన్లకు తాము మద్దతిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాగా, దీనిపై అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ డిమాండ్ చేసింది. దీనిపై కేరళ అధికార పార్టీ స్పందిస్తూ... కోర్టుకు సమర్పించిన వివరాలను బయటపెట్టలేమని పేర్కొంది.


పురుషులను అనుమతించి, మహిళలను అడ్డుకోవడం రాజ్యాంగంలోని 25, 26 ఆర్టికల్స్‌కు విరుద్ధమని.. ఇది వారి హక్కులను కాలరాస్తుందని పేర్కొంటూ 2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తేసింది. దీనిపై మెజార్టీ ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. కోర్టు ఆదేశాలతో ఆలయంలోకి మహిళలు ప్రవేశించేందుకు ప్రయత్నించడం.. వీటిని అయ్యప్ప భక్తులు అడ్డుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే 2019 జనవరిలో ఇద్దరు మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. ఇది మరింత అగ్గిరాజేసింది. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa