ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ భక్తుడి మరో భారీ విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 11:20 PM

తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ( టీటీడీ ) హైదరాబాద్ భక్తుడు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన సాతుళూరి తాండవ కృష్ణ మూర్తి అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు సోమవారం రోజున రూ.10,01,116 విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా భక్తుడిని టీటీడీ ఏఈవో అభినందించారు.


మరోవైపు హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ అనే భక్తుడు కూడా ఇటీవల తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందించారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు సిద్ధార్త రూ.50 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో.. సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం తాలూకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.


తిరుమల కోనేటిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌


మరోవైపు తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి రెండో తేదీ వరకూ తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ అధికారులు తెప్పల ట్రయల్‌రన్‌ నిర్వహించారు. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన వెంకయ్య చౌదరి.. సాలకట్ల తెప్పోత్సవాలకు తెప్పలను సిద్ధం చేసినట్టు వెల్లడించారు. ట్రయల్ రన్‌లో భాగంగా ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ, ఆలయ అధికారులతో కలిసి తెప్ప సామర్థ్యాన్ని పరిశీలించినట్లు వివరించారు.


తెప్పోత్సవాలలో భాగంగా మొదటి రోజు.. సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరిస్తారు. చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల నేపథ్యంలో ఫిబ్రవరి 26, 27 తేదీలలో తిరుమలలో సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో తిరుమలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ ఓ ప్రకటనలో కోరింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa