ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్తగారింట్లో కజ్జికాయలు పెట్టలేదని పోలీసులకు అల్లుడి ఫిర్యాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 06:31 PM

పోలీసులకు ప్రతి రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుంటాయి.. హత్య, ఆత్మహత్య, చోరీలు, బెదిరింపులు.. ఇలా చాలామంది పోలీసులకు కంప్లైంట్స్ చేస్తుంటారు. ఇక పాత కేసులో దర్యాప్తుల్లో బిజీగా ఉంటారు. అయితే అనంతపురం జిల్లాలో మాత్రం పోలీసులకు ఓ విచిత్రమైన ఫిర్యాదు వచ్చింది.. సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్థానికులు బంధువుల్ని ఈ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది.


ఓ వ్యక్తి తన ముగ్గురు అల్లుళ్లను బ్రహ్మోత్సవాల కోసం ఆహ్వానించారు. అల్లుళ్లు వస్తున్నారని ఇంట్లో కజ్జికయాలు తయారు చేయించారు. అయితే పెద్దల్లుడు, రెండో అల్లుడికి మామ కజ్జి కాయలు పెట్టారు.. తనకు మాత్రం కజ్జికాయలు పెట్టలేదని చిన్నల్లుడు బాగా హర్టయ్యాడు. ఇద్దరు అల్లుళ్లకు చేసినట్లు తనకు మర్యాద దక్కలేదని భావించాడు. అత్తమామలతో గొడవకు దిగాడు.. ఈ మర్యాద వ్యవహారం అక్కడితో ఆగలేదు, 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. ఈ సమాచారం అందుకున్న కానిస్టేబుల్ రాజగోపాల్ వెంటనే ఆ ఇంటికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కజ్జికాయలతో పాటుగా తనకు మర్యాద దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు అల్లుళ్లకు కజ్జికాయలు పెట్టి తనకు పెట్టలేదని.. ఇదేం న్యాయం అంటూ కానిస్టేబుల్‌తో అన్నారు.


కానిస్టేబుల్ రాజగోపాల్ వెంటనే ఆ కుటుంబసభ్యులందరికి నచ్చజెప్పారు. ముగ్గురు అల్లుళ్లను సమాచారం చూసుకోవాలని అత్తమామలకు సూచించారు. ముగ్గురికి సమానంగా కజ్జికయాలు పెట్టాలని చెప్పారు. కానిస్టేబుల్ అక్కడితో ఆగలేదు. ఆ కుటుంబంతో ఓ సెల్ఫీ తీసుకుని వారి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడం విశేషం. 'నమస్తే సార్ పాతేటలో 100 డెయిల్ కాల్‌కు అటెండ్ అయ్యాను. కాల్ చేసినవారిని విచారించగా.. కాలర్ ఆ ఇంటి మూడో అల్లుడు అయినందున.. ఇద్దరు అల్లుళ్లకు కజ్జికయాలు పెట్టి తనకు పెట్టలేదని 100కు డైల్ చేశారు. మేము అక్కడ విచారించి అందరిని సమానంగా చూసి కజ్జికాయలు అందరికీ సమానంగా పెట్టాలని సూచించినాము సార్.. నమస్తే సార్. నమస్తే సార్ డైల్ 100 ప్రాబ్లం సాల్వ్డ్ సార్' అంటూ అక్కడ ఏం జరిగిందో వివరించారు. కానిస్టేబుల్ రాజగోపాల్ వాట్సాప్‌లో అలా మెసేజ్ చేయగానే అధకారులు, సిబ్బంది నవ్వుకున్నారట. కజ్జికాయల వ్యవహారంలో చిన్నల్లుడికి అన్యాయం జరగడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం, కానిస్టేబుల్ వచ్చి సర్దిచెప్పడంతో అందరూ చర్చించుకుంటున్నారు.


ఇటు గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది. గవిమఠం ఆస్థాన గజలక్ష్మి (ఏనుగు) రథాన్ని అనుసరిస్తూ ముందుకు కదలింది. భక్తులు రథంపై పండ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa