ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం క్షిపణులతో దాదాపు 10 దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్, ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాల్లోని భారత పౌరులకు కేంద్రం అడ్వైజరీ జారీచేసింది. ఇజ్రాయెల్, ఇరాన్లో ఉండే భారత పౌరులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. భారతీయులు అత్యంత జాగ్రత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని ఈ మేరకు యూఏఈ, సౌదీ, జోర్డాన్ సహా గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు ప్రకటన జారీ చేశాయి.
‘‘ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా ఇజ్రాయెల్లోని భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇజ్రాయెల్ జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను పాటించాలి.. అనవసర ప్రయాణాలు రద్దుచేసుకుని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.. ఎప్పటికప్పుడు స్థానిక మీడియా, ఎమర్జెన్సీ అలర్ట్లను గమనించాలి. అత్యవసర పరిస్థితుల్లో టెల్అవీవ్ భారత ఎంబసీ సంప్రదించాలి’’ అని ట్వీట్ చేసింది. ఇందుకు హెల్ప్లైన్ నెంబరు +972-54-7520711, E-mail, cons1.telaviv@mea.gov.in ద్వారా సంప్రదించాలని కోరింది. ఎప్పటికప్పుడు పరిస్థితుల గురించి వెల్లడిస్తామనిని పేర్కొంది.
ఇరాన్లోని రాయబార కార్యాలయం ‘‘ప్రస్తుతం నెలకున్న పరిస్థితుల దృష్ట్యా ఇరాన్లోని భారత పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి.. అనవసరమైన ప్రయాణాలు మానుకుని... వీలైంతన మేర సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలి.. స్థానిక మీడియా వార్తలను, భారత ఎంబసీ నుంచి వచ్చే అప్డేట్లను ఎప్పటికప్పుడు గమనించాలి... ఏదైనా అత్యవసర సందర్భాల్లో +989128109115; +989128109109; +989128109102; +989932179359 నెంబర్లను సంప్రదించాలి’’ అని స్పష్టం చేసింది. కిందట వారమే ఇరాన్లో భారత్ పౌరులకు కేంద్రం సూచనలు చేసిన విషయం తెలిసిందే. తక్షణమే ఇరాన్ నుంచి వచ్చేయాలని సూచించింది.
‘‘భారత పౌరులు అనవసర ప్రయాణాలు మానుకోవాలి.. అత్యంత అప్రమత్తంగా ఉంటూ యూఏఈ అధికారులు జారీచేసిన భద్రతా సూచనలు పాటించండి’’ అని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అబుదాబీ ఎంబసీ, దుబాయ్లో కాన్సులేట్ ఆఫీసుల్లో నిరంతరయంగా సేవలు అందుబాటులో ఉంటాయని, అత్యవసరమైతే సంప్రదించాలని తెలిపింది.
సౌదీ అరేబియాలోని భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, జెడ్డాలోని కాన్సులేట్ సేవలు అందుబాటులో ఉంటాయని రియాద్లోని భారత ఎంబసీ ప్రకటించింది. జోర్డాన్లోని భారత రాయబార కార్యాలయం సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విమాన సేవలకు ఆంతరాయం కలగకముందే భారతీయ పర్యటకులు తక్షణమే జోర్డాన్ను వీడాలని అడ్వైజరీ ఇచ్చింది. బహ్రెయిన్లోని భారత ఎంబసీ, పాలస్తీనా రామల్లాలోని భారత ప్రతినిధి కార్యాలయాలు సైతం ఇలాంటి అడ్వైజరీలు జారీచేశాయి. అనవసర ప్రయాణాలు చెయెద్దని హెచ్చరించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa