అమెరికా–ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. మధ్యప్రాచ్యంలో సైనిక ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ ఆయిల్ సరఫరాకు కీలకమైన సముద్ర మార్గాలు ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా Strait of Hormuz మరియు Red Sea ప్రాంతాల్లో నెలకొన్న అనిశ్చితి, భారత్ వంటి దిగుమతులపై ఆధారపడిన దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.ప్రపంచ సముద్ర మార్గ చమురు రవాణాలో దాదాపు 30 శాతం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంది. ఒకవేళ ఈ జలసంధి మూసివేయబడితే, అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతిని, చమురు ధరలు ఒక్కసారిగా ఎగసిపడే ప్రమాదం ఉంది.ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారైన భారత్ తన అవసరాల్లో 85–88 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశానికి వచ్చే ముడి చమురులో గణనీయమైన భాగం హర్మూజ్ ద్వారానే చేరుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్క డాలర్ పెరిగినా భారత దిగుమతి బిల్లు బిలియన్ల డాలర్ల మేర పెరుగుతుంది. ఒకవేళ ధరలు బ్యారెల్కు 120–130 డాలర్లకు చేరుకుంటే, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. దాంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుంది. రూపాయి విలువ కూడా పడిపోయే ప్రమాదం ఉంది.ఇక ఆసియా–యూరప్ వాణిజ్యానికి కీలక మార్గమైన ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు షిప్పింగ్ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఓడలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తే ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు రెండూ పెరుగుతాయి. ఇది ఎగుమతి, దిగుమతులపై అదనపు భారాన్ని మోపుతుంది.ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఆసియా, యూరప్ దేశాలు ఇంధన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముండగా, చమురు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి ఎగుమతులు చేసే అమెరికా వంటి దేశాలు కొంత మేర లాభపడవచ్చు. ఈ నేపథ్యంతో భారత్ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయడం, సరఫరా మార్గాలను విస్తరించడం, వ్యూహాత్మక నిల్వలను బలోపేతం చేయడం అత్యవసరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa