చిన్నారి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు కామాంధులకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ విశాఖపట్నం మహిళా కోర్టు, ఆరో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి మోకా సువర్ణరాజు గురువారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఏడాది జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మామిదురి శైలజ అందించిన వివరాలిలా ఉన్నాయి. పెదగంట్యాడ మండలం బాపూజీ కాలనీకి చెందిన మహ్మద్ అమీర్ ఆలమ్(20), పోటేలు రంజీ(20), మహ్మద్ ఆషరిఫ్(19) కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2011 నవంబరు 28వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో చెల్లెలికి రొట్టె కొనేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన పదేళ్ల బాలికను వీరు ముగ్గురూ బలవంతంగా నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి దక్షిణ ఏసీపీ పి.త్రినాథ్ కేసు నమోదు చేశారు. నిందితులపై నేరారోపణ రుజువుకావడంతో నిందితులకు న్యాయమూర్తి జైలు శిక్ష, జరిమానా విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa