‘‘పేదల కోసం కేంద్రం పంపిన బియ్యాన్ని వైసీపీ నేతలు అక్రమంగా అమ్మి రూ.6,000 కోట్లు కొట్టేశారు. 9 నెలలపాటు పేదలకు ఉచితం గా పంపిణీ చేయాలని కేంద్రం బియ్యం పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4 నెలలు మాత్రమే పంపిణీ చేసింది. మిగిలిన 5 నెలల బియ్యం ఏమయ్యాయో కేంద్రం అడిగినా చెప్పడం లేదు’’ అని టీడీపీ శాసనసభాపక్ష ఉప నేత నిమ్మల రామానాయుడు శనివారం పేర్కొన్నారు. ‘‘2022లో ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వాలని కేంద్రం పంపింది. రేషన్ కార్డులో ఎందరి పేర్లు ఉంటే అంతమందికీ.. తలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇచ్చింది. మొత్తం 89 లక్షల రేషన్ కార్డులకు ఈ బియ్యాన్ని ఇచ్చారు. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.35 ఉంది. ఈ లెక్క న ఒక్కో కుటుంబం రూ.3,000 నష్టపోయింది. మొత్తం 6.75 లక్షల టన్నులు మాయం అయింది. మార్కెట్ ధర ప్రకారం చూస్తే ఈ బియ్యం విలువ రూ.6,000 కోట్లు. తాము పంపిన బియ్యానికి సంబంధించి జగన్ ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని స్వయంగా కేంద్రం చెబుతోంది. జగన్రెడ్డికి బినామీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ద్వారా ఈ బియ్యం విదేశాలకు తరలిపోయిందన్న అనుమానం కలుగుతోంది’’ అని నిమ్మల పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం పండుగ సమయాల్లో ఉచితంగా 6 రకాల సరుకులు ఇచ్చేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవన్నీ మాయమయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో మూడో రకం కందిపప్పు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa