ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్నేళ్లకు ఆ గ్రామం వెలుగులను చూసింది

national |  Suryaa Desk  | Published : Fri, Jan 13, 2023, 12:26 AM

మనదేశంలో ఇంకా కరెంటు అంటే ఏమిటో తెలియని గ్రామాలు ఉన్నాయన్న సంగతి తెలుసా...? స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా.. ఇన్నాళ్లు ఆ గ్రామం చీకట్లలోనే మగ్గింది. కిరోసిన్ దీపాలు, కొవ్వత్తుల మధ్యే జీవితాన్ని వెల్లదీసారు. ఎట్టకేలకు గ్రామంలో విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. దశబ్దాలుగా అలుముకున్న చీకట్లు తొలిగిపోవటంతో గ్రామస్థులు సంబరాలు జరపుకుంటున్నారు.


వివరాల్లోకి వెళితే.. జమ్ము కశ్మీర్, అనంత్‌నాగ్ జిల్లా డోరు బ్లాక్‌లోని టెథాన్ గ్రామానికి గత 75 ఏళ్లుగా విద్యుత్ సౌకర్యం లేదు. మారుమూల కొండ ప్రాతంలో ఉండే ఈ గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు ఉంటాయి. దాదాపుగా 200 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అక్కడ నివసించే ప్రజలు ఇన్నాళ్లు కిరోసిన్ దీపాలు, కొవ్వత్తులు, సంప్రదాయ కలపను మండించి తమ జీవితాలను వెల్లదీసేవారు. కొండ ప్రాంతంలో ఉండే ఈ గ్రామానికి విద్యుత్ సౌకర్యాన్ని అందించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నాల్లకు కేంద్ర ప్రభుత్వ సౌభాగ్య పథకం కింద ఈ గ్రామానికి కరెంట్ సదుపాయం కల్పిచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.


గతేడాది పనులు ప్రారంభించిన విద్యుత్ శాఖ అధికారులు.. ఎంతో కష్టపడి గ్రామంలో 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఇంటింటికి కరెంట్ సదుపాయాన్ని అందించారు. విద్యుత్తు శాఖ టెక్నికల్ అధికారి ఫయాజ్ అహ్మద్ సోఫీ మాట్లాడుతూ.. గ్రామంలో విద్యుత్ సౌకర్యం అందించటానికి 38 హైటెన్షన్ లైన్లు మరియు 57 ఎల్‌టి స్తంభాలతో 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం టెథాన్ గ్రామంలో నిర్విరామంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.


"మేము ఈ రోజు మొదటిసారిగా కరెంటును చూశాము. నా చిన్నతనం నుంచి కొవ్వత్తులు, కిరోసిన్ దీపాల మధ్యే కాలం వెళ్లదీశాం. కరెంట్ సౌకర్యం లేకపోవటంతో టీవీ, సెల్ ఫోన్ వంటివి మాకు తెలియదు. ఇన్నాళ్లకు కరెంట్ వచ్చింది. మా పిల్లలు ఇప్పుడు విద్యుత్ వెలుగులో చదువుతారు. వారు సంతోషంగా ఉంటారు. మా ముందు తరాలు విద్యుద్దీకరణ అద్భుతాన్ని చూడలేకపోయారు. కనీసం మేమైనా కరెంటును చూస్తున్నాం. మా కలను సాకారం చేసేందుకు కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు." అని గ్రామానికి చెందిన 60 ఏళ్ల జఫర్ ఖాన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


మారుమూల కొండ ప్రాతంలో ఈ గ్రామం ఉండటంతో 2022 ప్రారంభంలో విద్యుత్ అందించేదుకు పనులు ప్రారంభించారు. కొండ ప్రాతంలో ఉండటంతో హై టెన్షన్ లైన్ ట్యాపింగ్ వంటి అనేక సమస్యలు తలెత్తాయనాని విద్యుత్ అధికారులు చెప్పారు. అయితే, ఏళ్ల తరబడి చీకట్లలో మగ్గిన మారుమూల పల్లెకు ఇప్పుడు వెలుగులు అందించటం ఆనందంగా ఉందని అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa