నరసరావుపేట ఎంపీ సీటుపై టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టారు. వచ్చే ఎన్నికల కోసం ముందుగానే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారు. రెండు నెలల క్రితం వరకు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేశారు.. ఇంఛార్జ్లు లేనిచోట కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. కొన్ని మార్పులు చేర్పులు చేసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ సీటుపై ఫోకస్ పెట్టారు. ఈసారి ఎలాగైనా అక్కడ టీడీపీ జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. 2009, 2014లో టీడీపీ విజయం సాధించగా.. 2019లో మాత్రం ఓటమి ఎదురైంది.
వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ తరపున ఎవరు బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పెద్దగా యాక్టివ్గా లేరు.. తన రాజకీయ వారసుడ్ని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి.. కుదరని పక్షంలో నరసరావుపేటలో ఎంపీగా పోటీ చేయించాలని భావిస్తున్నారు. గతంలో కూడా టీడీపీ అధిష్టానం దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే నరసరావుపేటలో ఈసారి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే తర్జనభర్జన కూడా జరిగిందట.
ఈ క్రమంలో మైదుకూరు నియోజకవర్గ ఇంఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా మహేష్ యాదవ్ను నరసరావుపేట లోక్సభ స్థానానికి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అల్లుడు కూడా. ఇప్పటికే మహేష్ యాదవ్ను పోటీకి దింపితే ఎలా ఉంటుందని స్థానిక టీడీపీ నేతలతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు గురజాల, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో యాదవ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయట. అలా కూడా టీడీపీకి కలిసొస్తుందని మహేష్ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది.
మహేష్ కూడా కొంతకాలంగా పల్నాడు జిల్లా టీడీపీ నేతలతో టచ్లో ఉంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ అయ్యారు. దీంతో ఆయన నరసరావుపేట వెళ్లడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన పేరు దాదాపు ఫైనల్ అయినట్లు చెబుతున్నారు. ఆకస్మాత్తుగా మహేష్ యాదవ్ పేరు తెరపైకి రావడం టీడీపీలో కూడా చర్చనీయాంశం అయ్యింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా స్పందించారు.
నరసరావుపేట ఎంపీ సీటు వేరే వాళ్లకు ఎలా ఇస్తారని.. కడప వ్యక్తిని తీసుకొచ్చి నర్సరావుపేటలో పోటీ చేయిస్తే ఓడిపోతారని చెప్పుకొచ్చారు. అసలు అనూహ్యంగా ఆ వ్యక్తికి టికెట్ ఎందుకిస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. నరసరావుపేట ఎంపీ సీటు తనకు కాకపోతే కుమారుడికి ఇచ్చినా పర్లేదని.. అవసరమైతే తానూ పోటీకి సిద్ధమని చెప్పేశారు. ఒకడుగు ముందుకేసి తన సీటు వేరే ఎవరికో ఇస్తానంటే చూస్తూ ఊరుకోను అన్నారు. ఒకవేళ కడపవాళ్లకు సీటిస్తే తమ వర్గం సహకరించేది లేదన్నారు.
నరసరావుపేట రేసులో మహేష్ యాదవ్ పేరు వినిపిస్తుంటే.. రాయపాటి అలర్ట్ అయ్యారు. అందుకే కడప నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కూడా తన సీటును కాపాడుకునే పనిలో పడ్డారు. తన కుమారుడికైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అంతేకాదు రాయపాటి తన కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే రాయపాటి రంగారావు గుంటూరు వెస్ట్, పెదకూరపాడు, సత్తెనపల్లిలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట.. ఒకచోట అవకాశం ఇవ్వాలంటున్నారు మాజీ ఎంపీ. మొత్తం మీద నరసరావుపేట టీడీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa