ముఖ్యమంత్రి సొంతజిల్లా అయిన కడప జిల్లాలో దొంగనోట్ల వ్యవహారం కలకలంరేపింది. ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్సార్సీపీ మహిళా నేత, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టరుగా పని చేస్తున్న రసపుత్ర రజినిని నకిలీ నోట్ల చలామణి కేసులో బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. రజినితో పాటూ చరణ్సింగ్ను అదుపులోకి తీసుకున్నారు.. వీరి దగ్గర పోలీసులు రూ.44 లక్షల విలువగల రూ.500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో తమకు పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి ఈ నోట్లను తక్కువకు కొనుగోలు చేసి బెంగళూరులో చలామణిలోకి తీసుకొస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
వైఎస్సార్సీపీ మహిళా నేత దొంగనోట్ల కేసులో పోలీసులకు చిక్కడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రజిని ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీలో కీలక నేతగా ఉన్నారు. ఇటు రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టరుగా పదవి కూడా ఉంది. ఆమె పదవీకాలం ఇటీవల ముగియగా.. మరోసారి పదవిని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రజినిపై 2017లో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి.. ప్రొద్దుటూరులో పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రజిని పోలీసులకు దొరికిపోవడంతో ప్రతిపక్షం టీడీపీ అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసింది. నకిలీ నోట్ల చలామణిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్కుమార్ రెడ్డి. స్థానికంగా అప్పులు చేసి ఐపీ పెట్టిన రజనికి.. కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇప్పించారని ఆరోపించారు. ఈ ఫేక్ కరెన్సీ వెనుక ఎవరున్నారో తేలాలని.. సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు.
రజిని నకిలీ నోట్ల చలామణి వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి. ఈ ఫేక్ కరెన్సీ విషయంలో వాస్తవం ఉంటే వెంటనే ఆమెపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన పాత్ర ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa