ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యం మత్తులో నదిలోకి దిగి,,,ఇద్దరు మృతి.. మరో యువకుడు గల్లంతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 06:12 PM

మద్యం మత్తులో నదిలో దిగిన యువకులు తమ ప్రాణాలను పోగొట్టుకొన్నారు. దీంతో మద్యం మత్తు మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పార్టీ చేసుకుందామని ఒకచోట చేరిన స్నేహితులు.. ఈత కొడదామని నదిలోకి దిగి మృతిచెందారు. విజయవాడ నగరంలోని అజిత్‌ సింగ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ రహీం బాషా.. డాబాకొట్ల సెంటర్‌లో రెస్టారెంట్‌ నడుపేవారు. బాషాకు ఇద్దరు కుమార్తెలు. క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన షేక్‌ ఖాలీషా అలియాస్‌ పండు డ్రైవర్‌గా పనిచేసేవారు. ఇతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. కస్తూరిబాయిపేటకు చెందిన కిరణ్‌ ఓ హోటల్ మేనేజర్ గా పని చేసేవారు. ఇతనికి ఒక బాబు ఉన్నాడు.


ఈ ముగ్గురు మంచి స్నేహితులు. అయితే.. రెండు నెలల కిందట రహీం బాషా కొత్తకారు కొన్నాడు. వీరంతా గురువారం కారులో మద్యం సీసాలతో బయలుదేరారు. రాత్రి 8 గంటలకు పెనమలూరులోని చోడవరం వద్ద ఉన్న ఘాట్‌ నుంచి కారులో కిందకు దిగారు. దహన సంస్కారాలు చేసే ఆ ప్రాంతంలో.. వాహనం ఆపి.. తమ వెంట తెచ్చుకున్న మద్యాన్ని తాగారు. ఆ తర్వాత బాషా తన రెస్టారెంట్‌లో పనిచేసే అజగర్‌కు ఫోన్‌ చేసి బిర్యానీ తీసుకురమ్మన్నాడు. తీసుకుని ఘాట్‌ వద్దకు తెచ్చి ఇచ్చాడు. అక్కడ మళ్లీ నలుగురు కలిసి మద్యం తాగారు.


అనంతరం బాషా, ఖాలీషా, కిరణ్‌లు ఈత కోసమని నదిలోకి దిగారు. అజగర్‌ను కూడా రమ్మని బాషా అడిగాడు. అతను నిరాకరించడంతో.. రేపటి నుంచి పనిలోకి రావద్దని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడి నుంచి అజగర్‌ బయలుదేరి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులు నదిలో ఈత కొడుతూ మునిగిపోయారు. ముగ్గురిలో కిరణ్‌, ఖాలీషాకు ఈత వచ్చు. బాగా ఈతకొడతారు. రహీం బాషాకు ఈత రాదు. అయినా మద్యం మత్తులో ఉండడం.. బాగా చీకటి కావడం.. దీనికి తోడు ఆ ప్రాంతం లోతుగా ఉండటంతో.. ప్రాణాలు కోల్పోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa