దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక దశకు చేరుతోంది. ఈ కేసులో అరెస్టయిన ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం పురోగతిలో ఉందని.. రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఎన్ఫోర్స్మెంట్స్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. 14 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే, మాగుంట రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్పై మార్చి 13లోగా సమాధానం ఇవ్వాలని ఈడీని కోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను న్యాయమూర్తి మార్చి 16వ తేదీకి లిస్ట్ చేశారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఫిబ్రవరి 10వ తేదీన మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే రాఘవరెడ్డిని విచారించారు.
ఇదిలావుంటే ఈ కేసుకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డి భారీ మొత్తంలో నగదు బదిలీ, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన నేరాల్లో పాల్పంచుకున్నట్లు ఈడీ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులను విజయ్ నాయర్ సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు అందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సౌత్ గ్రూప్లో శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాగుంట రాఘవరెడ్డి సహా పలువురు ఉన్నారని నిందితులుగా ఉన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు కూడా నిర్వహించాయి. అయితే ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి గతంలో పలు సందర్భాల్లో వెల్లడించారు. కుట్రల వల్లే తన కుమారుడు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa