వై.ఎస్. వివేకా హత్య కేసు రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. పులివెందులలోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం విచారణకు రావాలని తాజా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై అవినాష్ రెడ్డి వెంటనే స్పందించారు. రేపు కుదరదని, తర్వాత వస్తానంటూ సీబీఐ నోటీస్కు రిప్లై ఇచ్చారు. అయితే సోమవారం ఖచ్చితంగా విచారణకు రావాల్సిందేనని సీబీఐ పట్టుబడింది.
ఈ క్రమంలో రేపు విచారణకు అవినాష్ రెడ్డి తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో పలుమార్లు వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసి ఆయనను విచారణకు పిలిచింది. హత్య కేసులోని కీలక పరిణామాలపై ఆయనను లోతుగా ప్రశ్నించింది. హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ లొకేషన్ ఘటనా స్థలంలో చూపించినట్లు గూగుల్ టేకౌట్ అనే అప్లికేషన్ ద్వారా సీబీఐ గుర్తించింది. దీంతో హత్య జరిగిన సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు? ఏం చేశారు? హత్యలో పాత్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మరోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సారి సీబీఐ ఏం ప్రశ్నిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఇటీవల వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ బాగా స్పీడ్ పెంచింది. ఈ కేసులోని కీలక పాత్రదారులకు నోటీసులు జారీ చేస్తోంది. ఇటీవల వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసి విచారించింది. భాస్కర్ రెడ్డిని పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఆయన హస్తం కూడా ఉన్నట్లు సీబీఐ అనుమానపడుతుంది.
ఇటీవల భాష్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ఆయనను ప్రశ్నించిన క్రమంలో.. ఇప్పుడు అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు జారీ చేయడం చూస్తుంటే ..ఈ కేసులో ఏదో జరగబోతుందనే సస్పెన్స్ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడం, అవినాష్ రెడ్డికి వరుసగా నోటీసులు జారీ చేసి విచారిస్తుండటంతో.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa