దేశంలో తాజాగా ఓ వింత పరిస్థితి నెలకొంది. దగ్గు, జ్వరం, శ్వాసకోస సమస్యలతో మనదేశంలో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. దేశంలో కోవిడ్-19 తగ్గుముఖం పట్టిందనుకొంటున్న సమయంలో పలుచోట్ల హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో జ్వరం, దగ్గుతో వందలాది మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. హాల్లెట్ ప్రభుత్వఆసుపత్రిలో ఒక్క రోజులో జ్వరం, నిరంతరాయంగా దగ్గు, శ్వాసకోశ సమస్యలతో 200 మంది ఆస్పత్రికి రాగా.. వీరిలో 50 మంది చికిత్స కోసం అడ్మిట్ అయ్యారు. ఈ ఆసుపత్రి వెలుపల జ్వర బాధితులు బారులు తీరారు. మరోవైపు, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకుంది.
ఇఫ్లూయెంజా ఏ వైరస్కు ఉప వర్గంగా భావిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ గత నెల రోజులుగా నగరంలో తీవ్రంగా వ్యాపించిందని నిపుణులు చెబుతున్నారు. హాల్లెట్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు కిక్కిరిసిపోవడంతో రోగులను ఇతర వార్డులకు తరలిస్తున్నారు. బాధితుడి కుటుంబసభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘శ్వాసపీల్చుకోడానికి ఇబ్బందిపడుతున్నాడు.. చికిత్స కోసం ఔరియా నుంచి కాన్పూర్కు వచ్చాం.. గత ఆరు రోజుల నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురికావడంతో కాన్పూర్కి తీసుకొచ్చాం’ అని చెప్పాడు. మరో రోగి బంధువు సైతం.. మేము కాన్పూర్లోని దెహత్ నుంచి వచ్చామని, దగ్గుతో ఊపిరి తీసుకోలేకపోతున్నాడని అన్నారు. వైద్యులు చాలా పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారన్నాడు.
కాన్పూర్లోని హల్లెట్ ఆస్పత్రి మెడిసిన్ విభాగం చీఫ్ డాక్టర్ రిచా గిరి మాట్లాడుతూ.. ఏటా వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాలు వస్తాయి.. కానీ, ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది.. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారని, జ్వరం, దగ్గుతో పాటు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వివరించారు. గత 24 గంటల్లో దాదాపు 24 మంది శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిపడ్డారని, వారికి ఆక్సిజన్ సపోర్ట్ ఇస్తున్నామని, మరికొందరికి వెంటిలేటర్పై చికిత్స చేస్తున్నామని డాక్టర్ తెలిపారు.
కోవిడ్-19 నుంచి ఈ వైరస్ను కోవిడ్-19 నుండి వేరు చేయడం కష్టం.. ఇది పరీక్ష తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది.. ఎందుకంటే, ఇది ఇన్ఫ్లుఎంజా ఏ ఉప రకం. ప్రతి సబ్ వేరియంట్ ప్రత్యేక కిట్ ఉన్నందున దీనిని పరీక్షించడం కష్టమవుతుంది అని తెలిపారు. హెచ్3ఎన్2 సోకిన 92 శాతం వ్యక్తుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, 86 శాతం రోగుల్లో తీవ్రమైన దగ్గు, 27 శాతం బాధితుల్లో ఊపిరి అందకపోవడం, 16 శాతం మందిలో విపరీతమైన తుమ్ములు ప్రధాన లక్షణాలుగా ఉంటున్నాయి. ఈ వైరస్ కారణంగా వచ్చిన జ్వరం 5-7 రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. దగ్గు మాత్రం సుమారు మూడు వారాల వరకు ఉంటోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa