పీఏసీ (ప్రజాపద్దుల కమిటీ)లో ఖాళీలను వెంటనే భర్తీచేయాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి సీతారామ్కు ఆ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఛైర్మన్ సహా 12మంది సభ్యులతో పీఏసీ ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉండేవారని గుర్తు చేశారు. వారిలో కొందరు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, విప్గా నియమితులైన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీల్లో కొందరు సభ్యులు పదవీవిరమణ చేశారన్నారు.
అందుకే పీఏసీలో శాసనసభ నుంచి 5, మండలి నుంచి 2 ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. కమిటీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయటానికి ఆటంకం ఏర్పడుతోందని.. ఆ ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ గతేడాది అక్టోబరు 21న అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాను అన్నారు. అయినా చేయలేదు.. ఇప్పటికైనా ఆ ఖాళీలను భర్తీచేస్తే పూర్తిస్థాయి కమిటీ కార్యకలాపాలను నిర్వహించగలదు అని లేఖలో ప్రస్తావించారు పయ్యావుల కేశవ్.
పీఏసీలో సభ్యులుగా ఉన్న మేరుగు నాగార్జున, జోగి రమేష్, ఉషశ్రీ చరణ్ మంత్రులుగా కేబినెట్లోకి వెళ్లారు. ఇక కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్గా.. కరణం ధర్మ శ్రీ ప్రభుత్వ విప్ అయ్యారు. వీరితో పాటూ మరో రెండు ఖాళీలు ఉన్నాయని లేఖలో ప్రస్తావించారు. ఈ ఏడు ఖాళీలను భర్తీ చేయాలని లేఖలో స్పీకర్ తమ్మినేనిని కోరారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa