గత 2019 ఎన్నికల తరువాత తీవ్ర నష్టాన్ని చవిచూసిన టీడీపీ ఇపుడిపుడే పుంజుకొంటోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ బలపడింది కాబట్టి.. నవంబర్ లేదా డిసెంబర్లో జగన్ ఎన్నికలకు వెళ్లొచ్చని.. ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన టీడీపీ జోన్- 3 సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలకే జగన్పై నమ్మకం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టభద్రుల్లో తిరుగుబాటు వచ్చిందని.. దాని ఫలితమే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని చంద్రబాబు వివరించారు.
'ఇక నుంచి తెలుగుదేశం పార్టీ.. అన్స్టాపబుల్. గేర్ మార్చి.. స్పీడ్ పెంచుతాం. సైకిల్ పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం. జగన్ చేసిన విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. అప్పులు చేయడం.. దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇకపై మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికార పార్టీ మరిన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జగన్ది ధన బలమైతే.. మనది జన బలం. పేదలను దోచుకున్న జగన్.. పేదల ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తి కంటే.. జగన్ ఆస్తి ఎక్కువ' అని చంద్రబాబు ఆరోపించారు.
'వచ్చే ఎన్నికల్లో మనం అధికారంలోకి రావడం ఖాయం. కష్టపడ్డ కార్యకర్తలను వెతుక్కుంటూ పార్టీనే వాళ్ల వద్దకు వస్తుంది. మన ప్రభుత్వంలో పైరవీలు ఉండవు. పార్టీ కోసం పనిచేసే వారే నా ఆప్తులు. వారికే ప్రాధాన్యత ఇస్తా. రాష్ట్రాన్ని బాగుచేయడం ఎంత ముఖ్యమో.. తెలుగుదేశం కుటుంబ సభ్యులను బాగుచేయడం అంతే ముఖ్యం. గతంలో కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన మాట వాస్తవం. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉండిపోయాను. ఈ సారి కార్యకర్తలకే పెద్ద పీట వేస్తా. ఎన్ని పనులున్నా కార్యకర్తలే ముఖ్యం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలి. కార్యకర్తలు యాక్టివ్ గా ఉండాలి. అధికారం లోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిని నియమిస్తాం. గ్రామ స్థాయి లో సమస్యలను పరిష్కరిస్తాం. సంతలో పశువుల మాదిరిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ కు ఇదే చివరి సారి కావాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మళ్లీ మోసపోతాం. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలి. నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలి' అని చంద్రబాబు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa