ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాను ఈ వేసవిలో ఎదుర్కొనేందుకు అమెరికా, నాటో దేశాలు అనుసరించే వ్యూహాలు, కీవ్కు చేయాల్సిన సాయం గురించి క్షుణ్ణంగా సిద్ధం చేసిన ప్లాన్ లీక్ కావడం కలకలం రేగుతోంది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నట్టు అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. సీక్రెట్ ప్లాన్ బయటపడటంతో ఇది భద్రతా వైఫల్యంగా అమెరికా రక్షణ విభాగం పేర్కొంది. సోషల్ మీడియాలో పోస్ట్ల విషయం తెలుసని, దీనిని పరిశీలిస్తున్నామని పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ సబ్రీనా సింగ్ తెలిపారు. ‘మాకు ఆ సోషల్ మీడియా పోస్టుల విషయం తెలుసు. ఈ విషయాన్ని మా శాఖ విశ్లేషిస్తోంది’ అని వివరణ ఇచ్చారు.
ఉక్రెయిన్కు సాయంపై అమెరికా-నాటో ప్లాన్ పత్రం ట్విటర్, టెలిగ్రామ్ల్లో వైరల్ అవుతోంది. ఇందులో ఛార్టులు, ఆయుధాల తరలింపు వివరాలు, బెటాలియన్ బలాలు, ఇతర సున్నితమైన సమాచారం ఉంది. ఐదు వారాల కిందటిదిగా తెలుస్తోన్న ఇందులో ఏప్రిల్ 1 తేదీ వరకు ప్లానింగ్ క్షుణ్ణంగా ఉండటం గమనార్హం. ఉక్రెయిన్కు చెందిన 12 బ్రిగేడ్లకు శిక్షణ వివరాలు కూడా ఉన్నాయి. వీటిల్లో తొమ్మిది బ్రిగేడ్లకు అమెరికా-నాటో శిక్షణ ఇచ్చాయి. ఉక్రెయిన్కు 250 ట్యాంకులు, 350 మోటరైజ్డ్ బ్రిగేడ్లు అవసరమని గుర్తించారు.
లీకైన పత్రాల్లో ఒక కీలక రహస్య డాక్యుమెంట్ కూడా ఉంది. ఇది రష్యా అనుకూల ప్రభుత్వ ఛానల్స్లో తిరుగుతోంది. దీంతోపాటు ఉక్రెయిన్ ప్రాంతాల్లో మందుగుండు ఖర్చును కూడా ఈ పత్రాల్లో పేర్కొన్నారు. వీటిల్లో హిమార్స్ రాకెట్ వ్యవస్థల ఖర్చు కూడా ఉంది. ఈ పత్రాలను కొందరు పశ్చిమ దేశాల సైనిక నిపుణులు కొట్టిపారేస్తున్నారు. వీటిల్లో ఉక్రెయిన్ బలగాల నష్టాలను ఎక్కువగా.. రష్యా బలగాల నష్టాలను తక్కువగా చూపుతున్నారని పేర్కొన్నారు. ఈ
అయితే ఆయుధాల డెలివరీలు, దళం, బెటాలియన్ బలాలు, ఇతర ప్రణాళికల చార్ట్లను బట్టి చూస్తే ఉక్రెయిన్కు సహాయం చేసే ప్రయత్నంలో అమెరికా నిఘా వైఫల్యాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, రాబోయే నెలల్లో యుద్ధం ప్లాన్ పత్రాల బహిర్గతం ప్రభావాన్ని అంచనా వేయడం కష్టం అని విశ్లేషకులు చెప్పారు. రష్యా ఇటీవలి తూర్పు ఉక్రెయిన్లో పట్టు సాధించడానికి తీవ్రంగా శ్రమించిందని, పెద్ద సంఖ్యలో సైనిక నష్టం జరిగిందని అంటున్నారు. సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్న పత్రాల్లో యుద్ధంలో రష్యా సైనికులు 16,000 నుంచి 17,500 మంది చనిపోతే.. ఉక్రెయిన్ సైనికులు 71,500 మంది చనిపోయినట్టు ఉంది. అయితే, పెంటగాన్, ఇతర విశ్లేషకులు మాత్రం రష్యా చాలా ఎక్కువ ప్రాణనష్టానికి గురైందని అంచనా వేశారు. ఉక్రెయిన్ కంటే ఎక్కువ మంది అంటే దాదాపు 200,000 మంది మరణించారని అంటున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa