కోడి కత్తి కేసు విచారణలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తరఫఫున ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలైంది. 2019 ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన కోడి కత్తి దాడి సంచలనం రెకెత్తించింది. విశాఖపట్నం విమానాశ్రయంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసుపై విజయవాడ ఎన్ఐఏ కోర్డులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని గత వాయిదా సందర్భంగా మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే కోర్టులో తాజాగా సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్లో సీఎం జగన్ కోరారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతల నిర్వహణ ఉందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాలపై సమీక్షలు ఉన్నాయని సీఎం జగన్ పిటిషన్లో వివరించారు. తాను కోర్టుకు హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఇందుకోసమే అడ్వొకేట్ కమిషనర్ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదుకు అభ్యర్థించాలన్నారు. లేదా వీడియో కాన్ఫరెన్స్, ఇతర మార్గాల ద్వారా సాక్ష్యం నమోదుకు వీలు కల్పించాలని కోరారు.
ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయమూర్తి.. విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు. ఈ క్రమంలో సీఎం జగన్ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కేసులో దర్యాప్తు లోతుగా జరపాలని సీఎం జగన్ మరో పిటిషన్ కూడా వేశారు. సీఎం జగన్ పిటిషన్లపై ఈ నెల 13వ తేదీన విచారణ జరుపుతామని ఎన్ఐఏ కోర్టు వివరించింది.
పౌరులకు కూడా హక్కులు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని కోడి కత్తి కేసు నిందితుడు శ్రీను తరఫు న్యాయవాది సలీం అన్నారు. ముఖ్యమంత్రి అయినా.. ప్రధాన మంత్రి అయినా రూల్ ఆఫ్ లా పాటించాల్సిందే అని అన్నారు. కోర్టుకు సీఎం జగన్ రావాలి.. సాక్ష్యం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నెల 13న తాము కూడా కౌంటర్ దాఖలు చేస్తామని.. ఈ కేసులో సీఎం జగన్ బాధితుడిగా ఉన్నందున తప్పకుండా కోర్టుకు హాజరుకావాలని న్యాయవాది అన్నారు.
ఇదిలావుంటే 2018 అక్టోబర్ 25వ తేదీన సీఎం జగన్ తన 294వ రోజు పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్లో ఉండగా.. సెల్ఫీ తీసుకుంటానంటూ వెయిటర్ వైఎస్ జగన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్పై కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో అప్రమత్తమైన జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ భుజానికి కత్తి తగలడంతో గాయమైంది. చిన్న గాయమే కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే సీఎం జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆస్పత్రిలో సీఎం జగన్ చేరగా.. వైద్యులు తొమ్మిది కుట్లు వేసినట్లుగా ప్రకటించారు. మూడు వారాల వరకూ రెస్ట్ తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు పెనుసంచలనమైంది. సీఎం జగన్పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీను ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa