తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ప్రకాశం జిల్లాలో నిర్వహించిన రోడ్ షోలకు సంబంధించి మూడు కేసులు నమోదు చేశాయి. యర్రగొండపాలెంలో అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటంపై నిర్వహకులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కిశోర్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం డీఎస్పీ కిశోర్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయం వద్ద రాళ్ల దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయంపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలను వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఇక, శుక్రవారం చంద్రబాబు సభ సందర్భంగా జరిగిన గొడవపై విచారణ జరువుతున్నట్లు డీఎస్పీ కిశోర్ కుమార్ తెలిపారు. ముందుగా అనుమతి పొందిన స్థలంలో కాకుండా, వేరే చోట సభ నిర్వహించడంపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత ఎవరెవరిపై కేసులు నమోదు చేయాలో నిర్ణయిస్తామని చెప్పారు. యర్రగొండపాలెం ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు.
మరోవైపు చంద్రబాబు కాన్వాయ్పై రాళ్ల దాడికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ నాయకులు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. జెడ్ కేటగిరి భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, మంత్రి ఆదిమూలపు సురేష్తో పోలీసులు కుమ్మక్కై దాడికి సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి వల్ల ఎన్ఎస్జీ సిబ్బందికి గాయాలైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎఎస్పీ నాగేశ్వరరావుకు ఫిర్యాదు అందజేశారు.
ఇదిలావుంటే శుక్రవారం చంద్రబాబు పర్యటన సందర్భంగా యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం సమీపంపై చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి జరిగింది. ఈ సమయంలో భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా ఉంచి బాబుకు రక్షణ కవచంలా నిలిచారు. ఈ సమయంలో ఎన్ఎస్జీ కమాండెంట్ సంతోష్ కుమార్ తలకు గాయాలు అయ్యాయి.
ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో యర్రగొండపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ నిర్వహకులపై కేసు నమోదు చేసినట్లు ప్రకాశం జిల్లా పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa