ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెయిట్ లాస్ పేరుతో అప్పుల పాలయ్యా,,,వారిపై చర్యలు తీసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 06:50 PM

మన బలహీనతలను  అవకాశంగా మల్చుకొని మోసం చేస్తున్న కంపెనీలు రోజురోజుకు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల కాలంలో వెయిట్ లాస్ సంస్థలు మార్కెట్‌లోకి చాలానే వచ్చాయి. చాలా ఈజీగా బరువు తగ్గొచ్చంటూ కలర్‌ఫుల్ యాడ్స్‌తో ఇట్టే జనాల్ని ఆకర్షిస్తున్నాయి. ఇంకేముంది అందరూ వెయిట్ లాస్ కోసం క్యూ కడుతున్నారు. బరువు తగ్గాలనే మోజులో పడి చాలామంది కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ మహిళ వెయిట్ లాస్ అవుదామని వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుని ఆస్పత్రి పాలైంది. ఏలూరులో కూడా మరికొందరు మహిళలు మోసపోయామంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకరు ఈ ట్రీట్మెంట్‌తో అనారోగ్యం పాలయ్యానని చెబుతుంటే.. మరో మహిళ తన పేరు మీద తీసుకున్న లోన్లతో ఇబ్బందిపడుతున్నామని చెబుతున్నారు.


ఓ మహిళ యాడ్ చూసి తన కుమారుడ్ని బరువు తగ్గించాలని తీసుకెళ్లినట్లు చెప్పారు. రూ.500 ఫీజు తీసుకుని.. అతడికి కొన్ని చెకప్స్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలని తనతో చెప్పారన్నారు. ఎంత ఖర్చవుతుందని అడిగితే చెప్పలేదని.. తన దగ్గర పాన్, ఆధార్ కార్డులు తీసుకుని లోన్‌కు దరఖాస్తు చేశారన్నారు. తాము అంత డబ్బులు కట్టలేమని చెప్పామన్నారు. తన పేరు మీద రూ.75 నుంచి 80 వేల వరకు లోన్ తీసుకున్నట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ఆ సంస్థకు వెళ్లి అడగగా తనను బెదిరించారని.. తనకు తెలియకుండా లోన్లు తీసుకుని మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు.. తనలా బాధితులు ఎంతో మంది ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఏలూరు జిల్లా శనివారపుపేటకు చెందిన మరో మహిళ కూడా ఆ సంస్థకు వెళ్లారు. రూ.500 ఫీజు కట్టి.. వెయిట్‌లాసే కాకుండా తల, హైబ్రోస్‌, ఫేస్‌కు సంబంధించిన ట్రీట్‌మెంట్‌ చేస్తానని తనను నమ్మించారన్నారు. తన దగ్గర ఆధార్‌కార్డు, పాన్‌కార్డు తీసుకుని ఓటీపీ వస్తే చెప్పమన్నారనీ.. అలా డౌన్‌ పేమెంట్‌ కింద రూ.25 వేలు, ఎస్‌బీఐ కార్డు ద్వారా రూ.45 వేలు, ఆర్‌బీఎల్‌ కార్డు ద్వారా రూ.15 వేలు ట్రీట్‌మెంట్‌కు తీసుకున్నట్లు తెలిసిందన్నారు. ట్రీట్‌మెంట్‌కు ఎంత అవుతుందో చెప్పకుండా నెలకు వెయిట్‌లాస్‌కు రూ.5,200 కట్టాలని చెబుతున్నారన్నారు. తన పేరుమీద మూడులోన్లు తీసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తనకు వాంతులు అయ్యాయని.. వణుకులా ఉంటోందని, రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టడం లేదని ఆమె చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థకు వెళ్లి అడగగా తనను బెదిరిస్తున్నారన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.


హైదరాబాద్‌లో కూడా ఇదే తరహాలో మరో ఘటన జరిగింది. సికింద్రాబాద్‌లోని కార్ఖానాకు చెందిన మరో మహిళ కూడా బరువు తగ్గించుకోవాలని టీవీల్లో, సోషల్ మీడియాలో యాడ్స్ చూసి వెయిట్ లాస్ చేసే సంస్థను సంప్రదించారు. మొత్తం 15 కేజీల బరువు తగ్గిస్తామని ఆమెకు చెప్పారు. మొత్తం రూ.40 వేలకు ప్యాకేజీ మాట్లాడుకున్నారు.. ముందుగా రూ.7వేలు చెల్లించారు. వెయిట్ లాస్ ట్రీట్మెంట్‌లో భాగంగా మొదటి రోజు వెళ్లిన మహిళకు మసాజ్ చేశారు. రెండో రోజు ఎలక్ట్రిక్ వైబ్రేట్ మిషన్‌తో ట్రీట్మెంట్ అందించారు.. ఆ వెంటనే ఆమెకు వాంతులు అయ్యాయి.


అక్కడి సిబ్బంది వాంతులు మామూలేనని చెప్పడంతో మహిళ పట్టించుకోలేదు. మళ్లీ మూడో సిట్టింగ్ కోసం వెళ్లగా.. మళ్లీ ఎలక్ట్రిక్ వైబ్రేట్ పెట్టారు. ఈసారి కడుపు నొప్పితో పాటూ వాంతులు అయ్యాయి.. ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. అక్కడి సిబ్బంది పట్టించుకోలేదు.. ఆ తర్వాత భర్త వచ్చి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. బరువు తగ్గాలని భావించి వెళితే ఇలా ఆస్పత్రి పాలయ్యామని బాధితులు చెబుతున్నారు. మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa