కొన్ని మిస్సింగ్ కేసులు నిజజీవితంలోనూ సినిమాలను తలపిస్తుంటాయి. ఇదిలావుంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో ‘అక్ష’ అనే చిన్నారి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. ఏడేళ్ల క్రితం తప్పిపోయిన చిన్నారి ఎట్టకేలకు తల్లి ఒడిలోకి చేరుకుంది. 2016లో తండ్రితో పాటు చిన్నారి కనిపించకుండాపోయింది. దీంతో తల్లి ద్వారక అప్పట్లోనే సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో తన కూతురు తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి తప్పిపోయిన కూతురి కోసం తల్లి ద్వారక వెతుకుతూనే ఉన్నారు. అయితే, ఎక్కడెక్కడో తిరిగి చిన్నారి అక్ష కరీంనగర్కు చేరుకుంది.
ఈ క్రమంలో సైదాపూర్ మండలంలో భాగ్యలక్ష్మి అనే మహిళ ఆ పాపను దగ్గరకు తీసింది. అయితే, భాగ్యలక్ష్మి దగ్గర పాప అనుమానస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు చిన్నారిని భాగ్యలక్ష్మి దగ్గరి నుంచి తీసుకొచ్చి కరీంనగర్లోని బాల రక్షా భవన్కు అప్పగించారు. ఆ తర్వాత పాప ఫొటోలు, వీడియోని మీడియాకు ఇచ్చారు. ఈ క్రమంలో పాప ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చూసి తమ బిడ్డే అంటూ ఇటీవల వేర్వేరు ప్రాంతాల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో పద్మ అనే మహిళ తన మనవరాలేనంటూ ఆధారాలు చూపించడంతో శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పద్మ చెప్పింది నిజమేనని నిరూపించుకున్న తర్వాత పాప తల్లి ద్వారకను అధికారులు పిలిపించారు.
తనతో గొడవపడి భర్త రవి పాపని తీసుకొని వెళ్లిపోయాడని ద్వారక అధికారులకు చెప్పారు. పాప కోసం అదే సమయంలో ద్వారక భర్త రవి కూడా రావడంతో.. చిన్నారి సమక్షంలోనే విడిపోయిన భార్యభర్తలు కలుసుకున్నారు. అన్ని ఆధారాలు ధ్రువీకరించుకున్న తర్వాత పాపను తల్లిదండ్రులకు అధికారులు అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa