ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ 'జై తెలుగు పార్టీ'ని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రకటించారు. తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడం తన లక్ష్యమని.. వారిని చైతన్య వంతులుగా చేయడానికే ఈ రాజకీయ వేదికను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ బాగా నష్టపోయిందని.. భాషా, సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయాయన్నారు. ఈ విలువల కోసం రాజకీయ నాయకులు, ప్రజలు పనిచేయాలని అభిప్రాయపడ్డారు.
జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించానని.. నీలం రంగు జలం, పచ్చ రంగు వ్యవసాయం, ఎరుపు రంగు శ్రమశక్తి, పసుపు వైభవానికి చిహ్నం, తెలుపు జల వనరులు స్వచ్ఛంగా ఉండాలన్నారు. వెనుక తెలుగు భాష రథాన్ని ప్రజలు లాగాలనేది తన ఆకాంక్షగా చెప్పుకొచ్చారు. తెలుగు భాష కోసం ఐదుగురు మహనీయులు కృషి చేశారు, త్యాగాలు చేశారని.. గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజి ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఫోటోలు తన జై తెలుగు రాజకీయ జెండాలో, ఎజెండాలో ఉంటాయన్నారు.
తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వారు ఎందరో ఉన్నారని.. ఈ ఐదుగురు ముందు వరుసలో ఉంటారని వివరించారు. మన భాషా సంస్కృతి వైభవం గురించి నేడు ఎవ్వరికీ తెలియని పరిస్థితి ఉందని.. నాడు మదరాసీలు అన్నారని.. నేడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామన్నారు. కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నామని.. 'మన భాషను మనమే విస్మరించి చులకన చేసుకున్నాం' అన్నారు. తెలంగాణ భాష మొత్తం ఒక్కటే.. ఏపీలో మాత్రం ప్రాంతాల వారీగా భాష మారిపోతుందన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా-గుంటూరు, నెల్లూరు, రాయలసీమ ఐదు రకాల భాషలు 'మనకి' ఉన్నాయన్నారు.
'మన భాషకు పునర్వైభవాన్ని తీసుకురావాలనేదే నా సంకల్పం' అంటున్నారు జొన్నవిత్తుల. భవిష్యత్తు తరాలకు తెలుగు భాషను అందించాలన్నదే తన లక్ష్యంగా చెప్పుకొచ్చారు. లక్షల కోట్ల బడ్జెట్, అధికారం ఉన్న ప్రభుత్వాలు తెలుగు భాషకు సమున్నత స్థానం కల్పించాలని.. మాతృ భాషను పరిరక్షణ రాజకీయ నాయకుల బాధ్యత అన్నారు. ఆగష్టు 15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామని.. తెలుగు భాషా పరిరక్షణ అజెండాతో వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామన్నారు. తెలుగు వాడి ఆత్మగౌరవం పేరుతో నాడు ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే.. ఇప్పుడు తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జొన్నవిత్తుల రంగంలోకి దిగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa