పోలీసుల తీరుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఇదిలావుంటే 'నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై అనంతపురం జిల్లాలో కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి, రైతు వ్యతిరేక పోకడలకు నిదర్శనం. బీమా కోసం రోడ్డెక్కారని ఉరవకొండలో రైతులపై కేసులు పెట్టడం సిగ్గు చేటు. మీ పాలనలో నాలుగేళ్లుగా సాగు సబ్సిడీలు లేవు.. గిట్టుబాటు ధరలు లేవు.. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు లేవు.. ఉన్నది కేవలం ప్రశ్నించిన రైతన్నలపై కేసులు మాత్రమే' అంటూ ట్వీట్ చేశారు.
రైతుకు కష్టం వచ్చిన ప్రతిసారీ తెలుగుదేశం ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు చంద్రబాబు. విపత్తులు, కరువు సమయాల్లో రైతును ఆదుకునేందుకు ఇన్సూరెన్సు, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పాలసీలు తెచ్చి అండగా నిలబడ్డామన్నారు. ముగిసిన వ్యవసాయ సంవత్సరంలో పంటలకు ఎంత బీమా కట్టారో.. ఎంత నష్టం జరిగిందో.. ఎంత మంది రైతులకు ఎంత పరిహారం చెల్లించారో వివరాలు చెప్పగలరా అన్నారు. 'పంటలకు పై నాడు సాక్షాత్తూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పి.. రైతులను వంచించి దొరికిపోయిన మీరు.. నేడు రైతులపైనే కేసులు పెట్టి అరాచకానికి అడ్రస్ గా మారారు. కేసులు పెట్టినందుకు అన్నదాతలకు క్షమాపణ చెప్పి.. బీమా సమస్యను పరిష్కరించాలి' అని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామ సచివాలయాన్ని రైతులు ముట్టడించారు. వీరికి టీడీపీ, ఏపీ రైతుసంఘం, టీఎన్ఎస్ఎఫ్ మద్దతు తెలపగా.. తాము నష్టపోయిన పంటలన్నింటికీ బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు లక్షల్లో నష్టపోయినట్లు అధికారులు అంచనా వేశారని.. కానీ ప్రభుత్వం విడుదల చేసిన పరిహార జాబితాలో ప్రధాన పంటలకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. పంటలకు కనీసం పెట్టుబడి కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని.. అన్ని పంటలకు బీమాను వర్తింపజేయాలని కోరారు.
ఎంతసేపటికి అధికారులు రాకపోవడంతో నేరుగా వెళ్లి అనంతపురం-బళ్లారి రహదారిపై బైఠాయించారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ఉరవకొండ అర్బన్ సీఐతో సహా పోలీసులు అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు.. వారు వెనక్కు తగ్గకపోవడంతో రైతుల్ని పోలీసులు బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. 30 యాక్టు అమల్లో ఉండగా అనుమతి లేకుండా ధర్నా చేశారన్న కారణంతో ఆందోళనలో పాల్గొన్న ఎనిమిదిమంది రైతులపై పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు స్పందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa