విశాఖ వెళ్లే పర్యాటకులకు ముఖ్యగమనిక. రుషికొండ బీచ్కు ఎంట్రీ టికెట్ను తీసుకొచ్చింది ప్రభుత్వం.. వాస్తవానికి బీచ్లోకి ప్రవేశం ఉచితం. కానీ ఇకపై రుసుము వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇకపై బీచ్లోకి అడుగుపెట్టాలంటే రూ.20 చెల్లించాల్సిందే. వచ్చే వారం (ఈ నెల 11) నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని పర్యాటకశాఖ నిర్ణయం తీసుకుంది. బ్లూఫ్లాగ్ బీచ్ నిర్వహణ, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసమే ఈ రుసుము వసూలు చేయాల్సి వస్తుందని అధికారులు తెలిపారు.
గతంలో మరుగుదొడ్ల వినియోగానికి వసూలు చేసే రూ.10ని రద్దు చేశామని కూడా గుర్తు చేశారు. పదేళ్ల లోపు పిల్లలకు ఉచిత ప్రవేశం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అలాగే పర్యాటకులకు తాగునీరు, మరుగుదొడ్లు, ప్రథమ చికిత్స సదుపాయం ఉచితంగా వినియోగించుకోవచ్చన్నారు. అయితే వాహనాల పార్కింగు రుసుము, స్నానాల గదుల ఛార్జీలు అదనంగా ఉంటాయన్నారు. ప్రవేశ రుసుము ద్వారా మరిన్ని అదనపు వసతులు కల్పించనున్నట్లు పర్యాటకశాఖ అధికారి శ్రీనివాస్ పాణి తెలిపారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో బీచ్ సందర్శనకు ప్రవేశ రుసుం నిర్ణయించడం ఇదే తొలిసారి అవుతుంది.
రుషికొండ బీచ్కు అంతర్జాతీయ బ్లూఫ్లాగ్ గుర్తింపు దక్కింది. ముఖ్యంగా కాలుష్య రహిత, సురక్షిత ప్రమాణాలు, మౌలిక వసతులు మెరుగవడంతో ప్రపంచ పటంలో ఉన్న బీచ్లలో తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేంద్రం దేశంలోని కొన్ని తీర ప్రాంతాలను ఎంపిక చేయగా అందులో రుషికొండ కూడా ఉంది. అందుకే ఇక్కడ రూ.7 కోట్లతో వసతులు కల్పించారు. ప్రత్యేకంగా బీచ్ మేనేజర్ను, సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా ఏపీటీడీసీకి తలకుమించిన భారం అవుతోంది. ప్రతి నెలా వివిధ రకాల ఖర్చులకు రూ.15 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది.
బీచ్ను నిర్వహించడంలో పర్యాటకశాఖకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ వాహనాల పార్కింగ్ రుసుము వసూలు చేస్తున్నారు. బైక్లకు రూ.10, బస్సులు, ఇతర వాహనాలకు రూ.30 నుంచి రూ.50 తీసుకుంటున్నారు. ఇలా ప్రతి నెలా రూ.3 లక్షలు ఆదాయం వస్తోంది. లోపల మూత్రశాలలు, స్నానాల గదులకు టిక్కెట్లు పెట్టారు. గతంలో బీచ్లోకి రాకపోకలు సాగించేందుకు రెండు మార్గాలు ఉండేవి.. కొండ ప్రాజెక్టు పనుల వల్ల ఒక వైపు మూసేశారు. దీంతో అందరూ ఒకే మార్గం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇది సెక్యూరిటీ పర్యవేక్షణకు ఇబ్బందిగా మారుతోంది. ఇవన్నీ చూసుకుని ఎంట్రీ టికెట్ వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa