ఏలూరు యాసిడ్ దాడి ఘటన మరువక ముందే ఎన్టీఆర్ జిల్లాలో మరో యాసిడ్ దాడి కలకలం రేపుతోంది. ఐతవరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై ఓ దుండగుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన వారిని బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది.
ఐతవరంకు చెందిన వివాహితకు నెల్లూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఈ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే గతకొన్ని రోజులుగా మహిళ సదరు ఆటో డ్రైవర్ను దూరం పెట్టింది. దీంతో ఆగ్రహించిన నిందితుడు తెల్లవారుజామున వివాహితపై కుటుంబ సభ్యులపై దాడి చేసి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరులోనూ గత నెల 13న ఓ వివాహితపై యాసిడ్ దాడి జరిగింది. ఏలూరు పట్టణానికి చెందిన ఎడ్ల ప్రాన్సిక (35)పై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందిన ఫ్రాన్సిక ఆ తర్వాత కన్నుమూశారు. ఆమె దుగ్గిరాల సమీపంలోని ఓ డెంటల్ కాలేజీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నారు. భర్త రాజమహేంద్రవరంలో కెమికల్ ఇంజినీరుగా పని చేస్తున్నారు. వీరు ప్రేమ వివాహం చేసుకోగా... కొంత కాలంగా విభేదాలు రావడంతో రెండేళ్లుగా భర్తతో విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. జూన్ 13న రాత్రి విధులకు వెళ్లి స్కూటీపై తిరిగి వస్తుండగా.. ఇంటికి సమీపంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై యాసిడ్తో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె తల, ముఖానికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు తొలుత విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి అనంతరం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాన్సిక అక్కడ చికిత్స పొందుతూ జూన్ 21న ప్రాణాలు విడిచింది.
ఈ యాసిడ్ దాడి చేసిన కేసులో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెహర మోహన్, బోడా నాగ సతీష్, బూడిద ఉషా కిరణ్లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ఎడ్ల ఫ్రాన్సిక చెల్లితో బోడా నాగ సతీష్ అనే వ్యక్తి పరిచయం పెంచుకొని తరచూ ఇంటికి వస్తున్న నేపథ్యంలో ఫ్రాన్సిక అతన్ని మందలించింది. దీంతో ఆమెపై కక్షపెంచుకొని మోహన్, ఉషా కిరణ్ అనే వ్యక్తుల సహాయం తీసుకుని ఆమెపై యాసిడ్ దాడి చేయించినట్లు పోలీసులు తెలిపారు. యాసిడ్ను ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్నందుకు ఏలూరు గడియారస్తంభం ప్రాంతానికి చెందిన కిరాణాషాపు వ్యాపారి త్రివిక్రమరావు సైతం పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa