అన్నమయ్య జిల్లా మదనపల్లె టమాటా రైతు హత్య కలకలంరేపుతోంది. కొద్దిరోజులుగా టమాటా ధరలు అమాంతం పెరగడంతో రైతు దగ్గర డబ్బులు దోచేయాలనే హత్య చేశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. బోడిమల్లదిన్నెకు చెందిన నారెం రాజశేఖర్ రెడ్డి అనే రైతు టమాటా పంటను సాగు చేశారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేయగా.. బెంగళూరులో ఉంటున్నారు. కొద్ది రోజులుగా టమాటా ధరలకు రెక్కలొచ్చాయి.. కేజీ 150 వరకు నడిచింది. దీంతో టమాటా పంటకు డిమాండ్ పెరిగింది.. రాజశేఖర్ రెడ్డి ఇప్పటి వరకు ఐదు కోతలు కోసి అంగళ్లు మార్కెట్లో విక్రయించాడు.
ఈ క్రమంలో రాజశేఖర్ రెడ్డి పొలం దగ్గరే నివాసం ఉంటున్నాడు. మంగళవారం కూడా రోజూలాగే టమాటాలు కోసి మార్కెట్కు తీసుకెళ్లి అమ్మాడు. మంగళవారం రాత్రి తిరిగొచ్చిన తర్వాత పాలు పోసేందుకు వెళ్లాడు.. ఇంతలో అతడి ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గురించి ఆయన భార్య జ్యోతిని అడిగారు.. పాలు పోయడానికి వెళ్లాడని వారితో ఆమె చెప్పింది. ఏ పని మీద వచ్చారని జ్యోతి ఆరా తీయగా.. టమాటాల కోసం వచ్చామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పాలు పోయడానికి వెళ్లిన రాజశేఖర్ రెడ్డి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భార్య జ్యోతి కంగారుపడింది.
జ్యోతి వెంటనే కూతుళ్లకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది.. వారు తండ్రి మొబైల్కు ఫోన్ చేసినా తీయలేదు. ఎందుకో వారికి అనుమానం వచ్చింది.. ఈ విషయం తల్లికి చెప్పారు. ఆ తర్వాత బంధువులతో కలిసి రాజశేఖర్ రెడ్డి కోసం గాలింపు మొదలు పెట్టారు. ఇలా వెతుక్కుంటూ వెళ్తున్న క్రమంలో ఓ చెట్టు కింద కాళ్లు, చేతులు కట్టేపేసినట్లు ఓ వ్యక్తి కనిపించాడు.. ఆ పక్కనే బైక్ కూడా ఉంది. దగ్గరకు వెళ్లి చూడగా రాజశేఖర్ రెడ్డి విగత జీవిలా పడి ఉన్నాడు.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బైక్పై వస్తున్న క్రమంలో రాజశేఖర్ రెడ్డిని ఆపి బలవంతంగా లాక్కెళ్లి.. కాళ్లు, చేతులు వెనక్కి కట్టేసి.. మెడకు టవల్ చుట్టి హత్య చేసినట్లు గుర్తించారు. అయితే అతడి జేబులో ఉన్న చిట్టీలను పోలీసులు గుర్తించారు. అందులో టమాటాల అమ్మకానికి సంబంధించి లెక్కలు రాసి ఉన్నాయి.. దీన్ని బట్టి చూస్తే రాజశేఖర్ రెడ్డి రూ.30 లక్షల వరకు టమాటాల అమ్మకం చేసినట్లు గుర్తించారట. ఆ డబ్బుల కోసమే రైతును దారుణంగా హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే టమాటాలు అమ్మిన డబ్బులు ఇంట్లో ఉంటే సేఫ్ కాదని భావించి.. టమాటా కోతలన్నీ అయ్యాక డబ్బులు తీసుకుంటానని మండీ వ్యాపారుల దగ్గరే ఉంచినట్లు సమాచారం. ఆ డబ్బుల ఉంటాయనే భావించి హత్య చేశారా.. ఇంకా ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కాల్ డేటా, టవర్ లొకేషన్ ఆధారంగా ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఎవరో వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఈ హత్యకేసు దర్యాప్తు కోసం స్పెషల్ టీమ్ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa