నెల్లూరు గోనె సంచిలో మృతదేహం మిస్టరీ వీడింది. ఎనిమిది నెలల తర్వాత ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్త కోసం ఓ మంత్రగాడిని హత్య చేసిన మహిళ.. ఈ కేసులో తన భర్త రెండో భార్యను ఇరికించాలని ప్రయత్నించి చివరకు అడ్డంగా దొరికిపోయింది. తన సవతి జైలుకెళ్తే.. భర్త తనకు దగ్గరవుతాడని మొదటి భార్య పన్నిన కుట్ర బయటపడింది. నెల్లూరు ఎన్సీసీ కాలనీకి చెందిన జహీర్ బాషా మందుల షాపు నిర్వహిస్తున్నారు. ఆ షాపులో కావ్య అనే మహిళ పనిచేస్తోంది.. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు.. కూతురితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది.
కావ్య జహీర్తో ప్రేమలో పడింది.. ఆమె తన పేరును సమీరగా మార్చుకుని జహీర్ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత జహీర్ బాషా అస్మా అనే మరో యువతిని వివాహం చేసుకున్నాడు. రెండో పెళ్లి తర్వాత భర్త ఎక్కడ తనకు దూరం అవుతాడోనని సమీర భయపడింది. భర్తకు ఎలాగైనా దగ్గర కావాలని భావించింది. ఈ క్రమంలో తన మనసులో మాటను తన స్నేహితురాలైన వెంగళరావ్నగర్కు చెందిన కృష్ణవేణితో చెప్పింది. ఆమె ద్వారా యూట్యూబ్లో వశీకరణ పూజలు చేస్తామంటూ చేసిన వీడియోలను చూశారు.. అలా ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన మణికంఠను గతేడాది సంప్రదించారు.
మణికంఠ నెల్లూరు వచ్చి సమీర, కృష్ణవేణిని కలిశారు. భర్త తన దగ్గరకు వచ్చేలా చేయాలని మణికంఠను సమీర కోరింది. అంతలోనే సమీర తన ప్లాన్ మొత్తాన్ని మార్చేసింది. తన భర్త రెండో భార్య అస్మాను అడ్డు తొలగించుకుంటే భర్త తనతోనే ఉంటాడని సమీర భావించింది. తన కుమార్తె సాయిప్రియ, స్నేహితురాలు కృష్ణవేణితో కలిసి ప్లాన్ చేసింది. మణికంఠను చంపేసి.. అస్మా మీదకు నేరు నెట్టేస్తే ఆమె జైలు పాలవుతుందని భావించింది. ఈ విషయాన్ని కృష్ణవేణి, తన కుమార్తె సాయిప్రియకు చెప్పింది.
క్లచ్కు తాడు కట్టి ఒంటి చేత్తో డ్రైవింగ్.. రైతుకు కష్టం తప్పదు
గతేడాది నవంబరు 1న రాత్రి ఇంటికి వచ్చిన మణికంఠకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. చనిపోయాడని నిర్థారించుకున్న తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కేశారు. తన హత్యకు అస్మాయే కారణం అంటూ రాసిన చీటిని మృతుడి జేబులో పెట్టి.. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి స్కూటీపై తీసుకెళ్లి గౌతమ్నగర్ రెండో వీధిలో పడేశారు. నవంబరు 2న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి దర్యాప్తు చేయగా మృతుడు ఎవరనేది తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి జేబులో లభ్యమైన లేఖ ఆధారంగా దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం నివేదికలో మణికంఠది హత్యని తేలింది.
మణికంఠను హత్య చేసిన తర్వాత.. అతడి ఏటీఎం కార్డు ద్వారా సమీర రూ.3.50 లక్షలను విడతల వారీగా డ్రా చేసింది. అందులో రూ.లక్షను స్నేహితురాలికి ఇచ్చి మిగిలిన డబ్బులతో బంగారం కొనుగోలు చేసింది. పోలీసులు టెక్నాలజీ సాయంతో దర్యాప్తు చేస్తే సమీరను ప్రధాన నిందితురాలిగా తేల్చారు. ఆమెకు సహకరించిన కుమార్తె సాయిప్రియ, స్నేహితురాలు కృష్ణవేణిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 25 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు మొబైల్స్, రెండు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa