ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపొడిచే అవకాశం కనిపిస్తోంది. ఎన్డీయే సమావేశానికి హాజరవడానికి జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. హస్తినలో ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఎన్నికల ఫలితాలను బట్టి నిర్ణయిస్తామని చెప్పారు. సీఎం ఎవరు కావాలనేది ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. తమకు అండగా ఉండే వారినే ప్రజలు కోరుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని... వైసీపీని గద్దె దించడమే తన లక్ష్యమని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరం కలిసి పోరాడాలని చెప్పారు. పవన్ తాజా వ్యాఖ్యలతో ఏపీలో పొత్తులపై చాలా వరకు క్లారిటీ వచ్చినట్టయింది. టీడీపీతో కలిసి పోటీ చేస్తామనే విషయాన్ని ఇప్పటి వరకు పవన్ ప్రకటించని సంగతి తెలిసిందే. అయితే, ఢిల్లీ వేదికగా పొత్తుపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోయే పరిస్థితి ఉంది. మూడు పార్టీలు కలిసి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa