తిరుమలకు వచ్చే నెలలో వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలలో శ్రీవారి ఆలయం దగ్గర గల పుష్కరిణిని నెల రోజుల పాటూ మూసివేయనున్నారు. పుష్కరణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదని టీటీడీ తెలిపింది. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తారు. మరోవైపు అక్టోబర్ నెలకు సంబంధించిన వసతి గదుల కోటాను టీటీడీ నేడు విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి అవసరమైన వారు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
పుష్కరిణి మరమ్మతుల కోసం మొదటి పది రోజుల పాటు నీటిని తొలగిస్తారు. ఆ తరువాత పది రోజులు మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేస్తారు. చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. పుష్కరిణిలోని నీటి పిహెచ్ విలువ 7 ఉండేలా చూస్తారు. టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు చేపడతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
తిరుమల నాదనీరాజనం వేదికపై జరుగుతున్న మహాభారత ప్రవచనాల్లో భాగంగా సోమవారం రాత్రి అరణ్యపర్వ పారాయణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్.అవధాని, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం నుంచి పలువురు పండితులు పాల్గొన్నారు.
తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ పవన కుమార శర్మ ప్రవచనం వినిపించగా, అతిథి అధ్యాపకులు డాక్టర్ భరద్వాజ శర్మ శ్లోకపారాయణం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకురాలు డా.కె.వందన పలు శ్రీకృష్ణ సంకీర్తనలను రాగయుక్తంగా గానం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ ప్రతిరోజూ రాత్రి 8 నుండి 9 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa