ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాయలసీమపై చంద్రబాబు దృష్టి,,,నాలుగు రోజుల పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 30, 2023, 06:20 PM

ఇటీవల ఏపీలోని ప్రాజెక్టుల పరిస్థితిపై మంగళగిరి టీడీపీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వైసీపీ ప్రభుత్వంలో ఏపీలోని ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం జరుగుతుండటాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టు పనులు నిలిచిపోవడాన్ని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతవరకు కంప్లీట్ చేశామనే విషయాలు చెబుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నత్తనడకన జరుగుతున్నాయని వివరించారు.


ఈ క్రమంలో పనులు వేగంగా చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులన్నింటినీ సందర్శించేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు ఏ రోజు ఏ ప్రాజెక్టును సందర్శిస్తారనే దానిపై షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. ఆగస్టు ఒకటిన బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సందర్శించనుండగా.. అనంతరం నందికొట్కూరులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ తర్వాత అదే రోజు మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సందర్శనతో పాటు ఆలూరులో రాత్రి బస చేయనున్నారు.


ఇక ఆగస్టు 2న మాల్యాల ఎత్తిపోతల పథకం, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, నందికొట్కూరు గోరకల్లు రిజర్వాయర్ పనులను చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం పాణ్యం, బనగానపల్లి, కోవెలకుంట్లలో పర్యటించనుండగా.. జమ్మలమడుగులో రాత్రి బస చేస్తారు. అలాగే ఆగస్టు 3న గండికోట రిజర్వాయర్, పైడిపాలెం రిజర్వాయర్ పరిశీలించి అనంతపురంలో రాత్రి బస చేస్తారు. ఆగస్టు 4న అమిద్యాలలో బిందు సేద్యం ప్రాజెక్టు, ఒంటిమెట్ట వద్దజీడిపల్లి-బీటీపీ కాలువ, ఆత్మకూరు సమీపంలో జీడిపల్లి-పేరూరు కాలువ పనులను పరిశీలించనున్నారు. నాలుగు రోజుల పాటు రాయలసీమలో చంద్రబాబు పర్యటించనుడగా.. పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో రాయలసీమలో చంద్రబాబు పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


ఇప్పటికే రాయలసీమలో నారా లోకేష్ పాదయాత్ర ముగిసి ప్రకాశం జిల్లాకు చేరుకుంది. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గంలో జరుగుతుండగా.. త్వరలో పల్నాడు జిల్లాలో లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టనుంది. రాయలసీమలో లోకేష్ పాదయాత్ర ముగియడంతో ఇప్పుడు అక్కడ చంద్రబాబు పర్యటన పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa