ఆధునిక భారతంలో నేడు ప్రతి చోటా అవసరమైన లాప్టాప్ లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతిపై ప్రభుత్వం ఇటీవల హఠాత్తుగా ఆంక్షలు విధించడం చాలా మందికి దిగ్భ్రాంతి కలిగించింది. అంతేకాదు, ఇంటర్నెట్ ఆధారిత లోకంలో ఇలాంటి కొత్త ‘నిత్యావసరాల’ దిగుమతులు సాఫీగా జరిగేలా చూడకుండా వాటి నిరంతర సరఫరాను ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అడ్డుకోవడం ఎంత వరకు సబబు? ఇలాంటి ఆంక్షలు దేశంలో లాప్టాప్ లు, టాబ్లెట్లు, పీసీల ఉత్పత్తి అవసరమైనంతగా పెరిగి, నాణ్యత గల కంప్యూటర్లు సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయా? లేక ఈ దిగుమతుల పరోక్ష ‘నిషేధం ఉత్తర్వులు’ అనుకున్న లక్ష్యాలు సాధించకపోతే చివరికి పాత మార్గంలోనే పయనించాల్సి వస్తుందా? ఇలాంటి కీలక వినియోగ వస్తువుల దిగుమతిపై ఆంక్షలు పెట్టడానికి దేశ భద్రత ప్రధాన కారణమని ప్రకటించారు. దీంతో ఈ విషయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్ సెట్లను స్థానికంగా తయారుచేసుకోవడంలో ఇండియా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. కాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హార్డ్ వేర్ రంగంలో (లాప్టాప్ లు, పీసీలు, టాబ్లెట్లు) ఆశించినంత అభివృద్ధి ఇంకా సాధించలేదు. భారతదేశంలో వినియోగించే దాదాపు 65 శాతం లాప్టాప్ లు, పీసీలను దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులపై ఆంక్షలతో దేశీయంగా ఈ ఐటీ హార్డ్ వేర్ ఉత్పత్తుల తయారీ గణనీయంగా పెంచాలనుకునే ఆశయం మంచిదే. మరి ఈ పని ఎప్పుడో చేసి ఉంటే లాప్టాప్ లు, పీసీల తయారీ రంగం ఎంతో ముందుకు సాగేదని కొందరు నిపుణులు భావిస్తున్నారు. దిగుమతులకు తగినంతగా అడ్డుకట్ట వేయడంలో జరిగిన విపరీత జాప్యం వల్ల సింగపూర్, హాంకాంగ్, వియత్నాం వంటి తోటి ఆసియా దేశాలు ఈ రంగంలో తిరుగులేని అభివృద్ధి సాధించాయి. మరోపక్క కంప్యూటర్ సాధనాల తయారీ, ఎగుమతిలో చైనా ఎదురులేని అగ్రశేణి దేశంగా తన ఆధిపత్యం కొనసాగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa