తిరుమలలో ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుత దాడి చంపిన ఘటన మరో మలుపు తిరిగింది. ఈ ఘటనపై స్పందించిన నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. తాను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డితో మాట్లాడినట్లు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని ఈవో, ఛైర్మన్ తనతో చెప్పారన్నారు. అయితే ఈ ఘటనలో తల్లిదండ్రులపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. తనకు ఎందుకో తల్లిదండ్రులపై అనుమానం ఉందన్నారు. పోలీసులు వారిని కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ విషయం కాబట్టి ఆ కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు.
మరోవైపు లక్షిత మృతదేహానికి రుయా ఆస్పత్రిలో పోస్ట్మార్టమ్ తర్వాత సొంత ఊరు కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకు తరలించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందంటున్నారు. అయితే లక్షితపై ఎలుగుబంటి దాడి చేసిందని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. కానీ పోస్ట్మార్టమ్ రిపోర్టులో ఫోరెన్సిక్ నిపుణులు చిరుత దాడి చేసి హతమార్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
చిన్నారి లక్షితపై దాడి చేసింది చిరుత పులేనని తండ్రి దినేష్ కుమార్ అంటున్నారు. 70 మంది టీటీడీ సెక్యూరిటీ నిన్న రాత్రంతా అడవిలో తిరిగారని.. తమ పాప క్షేమంగా దొరుకుతుందని భావించామన్నారు.. కానీ ఇలా శవమై కనిపిస్తుందని తాము అనుకోలేదన్నారు. టీటీడీ, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే తమతో కలిసి వారు కూడా రాత్రంతా గాలించారని దినేష్ చెబుతున్నారు.
మరోవైపు ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. 'కుటుంబసభ్యులతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమల కొండకు కాలినడకన వెళ్తున్న ఆరేళ్ళ చిన్నారి లక్షిత చిరుత దాడిలో మృతి చెందడం అత్యంత విషాదకరం. కళ్ళముందే క్రూర జంతువు కూతురిని లాక్కెళ్లిపోతే ఆ బాధ వర్ణనాతీతం. పాప తల్లిదండ్రులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కొద్దిరోజుల క్రితం చిరుత దాడిలో బాలుడు గాయపడ్డ ఘటన జరిగింది. ఈ కారణంగా అయినా టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం తప్పేది. అధికారులు సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరించి, తగు రక్షణతో భక్తుల భయాన్ని తొలగించాలి' అంటూ ట్వీట్ చేశారు.
ఈ ఘటన తర్వాత టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు మరోసారి సూచనలు చేస్తున్నారు. నడకదారిలో వచ్చే భక్తులు గుంపులుగా వెళ్లాలని మరోసారి సూచిస్తున్నారు.. చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa