మూడేళ్ల పాటు సహజీవనం చేసిన ప్రియుడి .. తిరిగి తన భార్య, పిల్లల వద్దకు వెళ్లిపోయాడని పగతో రగిలిపోయింది. తమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడి పదకొండేళ్ల కుమారుడ్ని గొంతుపిసికి చంపేసింది. అత్యంత దారుణమైన ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలో ఇందర్పురిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిందితురాలు పూజా కుమారి (24)కి జితేందర్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే అతడికి వివాహమై.. ఓ కొడుకు ఉన్నాడు. 2019 నుంచి పూజా, జితేందర్ మూడేళ్ల పాటు సహజీవనం చేశారు. మూడేళ్ల అనంతరం జితేందర్ మళ్లీ తన కుటుంబం వద్దకు వెళ్లిపోయాడు.
తనను వదిలేసి వెళ్లిపోవడంతో అతడిపై పగను పెంచుకున్న పూజా కుమారి.. జితేందర్ కోసం ఆరా తీసింది. ఆగస్టు 10న జితేందర్ ఎక్కడున్నాడో తనకు అడ్రస్ చెప్పాలని ఓ కామన్ ఫ్రెండ్కు ఫోన్ చేసి అడిగింది. అతడు ఇందర్పురిలో ఉంటున్నట్టు చెప్పడంతో చివరకు జితేందర్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో జితేందర్ కుమారుడు దివ్యాన్షు (11) మాత్రమే ఉన్నాడు. తలుపు తెరిచి ఉండగా.. దివ్యాన్షు నిద్రపోతున్నాడు. ఇదే అదునుగా భావించిన పూజా.. నిద్రపోతున్న చిన్నారిని గొంతునులిమి హత్య చేసింది. అనంతరం బెడ్కు ఉన్న బాక్సులో ప్యాక్ చేసిన బట్టలు తీసిన మృతదేహాన్ని దాని లోపల దాచిపెట్టింది.
కొద్ది సేపటి తర్వాత ఇంటికొచ్చిన జితేందర్ భార్య తన కుమారుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యింది. బెడ్ సమీపంలో బట్టలు చిందరవందరగా పడి ఉండటంతో అనుమానంతో తెరిచి చూడగా కొడుకు విగతజీవిగా కనిపించాడు. దీంతో జితేందర్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఓ మహిళ వారి ఇంటికి వచ్చినట్టు గుర్తించారు. అయితే, ఆమె ఎక్కడుందనేది మాత్రం తెలుసుకోవడం పోలీసులకు కష్టంగా మారింది.
చాలా రోజుల నుంచి ఆమె తన తల్లిదండ్రుల వద్ద ఉండకపోవటంతో నిందితురాలి ఆచూకీ కోసం మూడు రోజులు గాలించారు. ఇందర్పురి, దాని పొరుగున ఉన్న నజాఫ్గఢ్ -నాంగ్లోయ్ రహదారిలోని రంహోలా, నిహాల్ విహార్, రిషాల్ గార్డెన్లోని దాదాపు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని ట్రాక్ చేయడం ప్రారంభించారు. చివరకు ఆమె అదే ప్రాంతంలో ఉన్నట్టు నిర్దారణకు వచ్చి.. ఎప్పటికప్పుడు పూజా తన స్థావరం మార్చేసింది. మూడు రోజులు తప్పించుకుని తిరిగినా.. చివరకు మంగళవారం ఆమెను పట్టుకోగలిగారు. ఆమెపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి, నిందితురాలిని కోర్టులో హాజరుపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa