వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం సమీపంలో ఉన్న జ్ఞానవాపీ మసీదు వివాదం ఊహించని మలుపు తిరిగింది. వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకుందామని కోరుతూ ఓ హిందూ సంస్థ లేఖ రాసింది. జిల్లా కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపీ ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ శాస్త్రీయ సర్వే జరుగుతోన్న తరుణంలో ఈ లేఖ రాయడం గమనార్హం. హిందూ, ముస్లిం వర్గాలు పరస్పర విశ్వాసంతో చర్చించి జ్ఞానవాపీ కాంప్లెక్స్ విషయంలో పరిష్కారం కనుగొనాలని పేర్కొంటూ విశ్వ వేదిక్ సనాతన సంఘటన్ అధ్యక్షుడు జితేంద్ర సింగ్ బిసెన్ గురువారం బహిరంగ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘‘హిందూ, ముస్లిం వర్గాలు పరస్పర విశ్వాసంతో చర్చించి జ్ఞానవాపీ మసీదు విషయంలో పరిష్కారం కనుగొనాలి.. ఈ కేసులో ప్రధాన న్యాయవాది రాఖీ సింగ్ సమ్మతితో హిందూ పక్షం తరఫున నేను లేఖ రాశా.. ఈ వివాదాన్ని కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తున్నాయి.. ఇటువంటి పరిస్థితుల్లో దేశ భద్రత దృష్ట్యా వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడం మనందరి కర్తవ్యం’ అని జితేంద్ర సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. పరస్పర అంగీకారంతో ఈ వివాదానికి పరిష్కారం లభిస్తే.. అంతకంటే మంచిది ఉండదని అన్నారు.
‘పరస్పర చర్చల ద్వారా వివాదాన్ని కోర్టు వెలుపల శాంతియుత పరిష్కారం లభించే అవకాశం ఉంది.. ఈ చర్చకు మిమ్మల్ని బహిరంగంగా స్వచ్ఛమైన హృదయంతో స్వాగతిస్తున్నాం’ అని అన్నారు. కాగా, లేఖపై మసీదు కమిటీ స్పందించింది. సమావేశంలో చర్చిస్తామని ఇంతేజామియా మసీదు కమిటీ జాయింట్ సెక్రటరీ మహ్మద్ యాసిన్ తెలిపారు.
‘మీడియా ద్వారా మాకు లేఖ అందింది. కమిటీ సమావేశంలో లేఖ అందజేయనున్నాం.. కమిటీ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చెల్లుబాటవుతుంది’ని యాసిన్ అన్నారు. ఇదే సమయంలో ఈ కేసులో హిందూ సంఘాల తరఫున వ్యాజ్యాలు దాఖలు చేసిన న్యాయవాది హై శంకర్ జైన్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘సనాతన ధర్మ కాశీ విశ్వనాథ్ ఆలయానికి సంబంధించి అంగుళం కూడా రాజీపడబోమని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.. దీనిపై ముస్లింలు క్షమాపణలు చెప్పే అవకాశం ఉంది.. వారి అక్రమ ఆక్రమణలను తొలగించాల్సిందే’ అని అన్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థలంలో చారిత్రక తప్పిదం జరిగిందని అంగీకరించి, పరిష్కార ప్రతిపాదనకు ముస్లిం సమాజం ముందుకు రావాలని వ్యాఖ్యానించారు. ‘మనం దానిని మసీదు అని పిలిస్తే అది వివాదానికి దారి తీస్తుంది.. మనం జ్ఞానవాపీ అనాలి. ఇది జ్ఞానవాపీ... మసీదు లోపల త్రిశూల్ ఏం చేస్తోంది?’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa