తిరుమలలో ఇటీవల చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం తరుచుగా కనిపిస్తుంది. దీంతో టీటీడీ అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటోంది. నడకదారి, ఘాట్రోడ్లల్లో భక్తుల భద్రత కోసం పలు చర్యలు చేపడుతోంది. సాయంత్రం ఆరు తర్వాత ఘాట్ రోడ్లో ద్విచక్రవాహనాలకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. అలాగే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను మెట్ల మార్గంలో అనుమతించడం లేదు.
ఇటీవల కూడా ఒక చిరుత ట్రాప్ కెమెరాల్లో కనిపించడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో టీటీడీ ఒక కీలక ప్రకటన జారీ చేసింది. తిరుమలలో క్రూరమృగాల సంచారంపై వదంతులు సృష్టించవద్దని సూచించింది. అలాగే వదంతులు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. వదంతులు సృష్టించడం వల్ల భక్తులు ఆందోళనకు గురయ్యే అవకాశముంటుందని, అలాంటి పనులు ఎవరూ చేయవద్దని సూచించింది. అలా చేసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని టీటీడీ పేర్కొంది.
క్రూరమృగాల సంచారంపై సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. చిరుతల సంచారం ఎక్కువగా ఉన్నచోట రెస్క్యూ టీమ్లను ఏర్పాటు చేశామని, భక్తులకు అధికారులు సూచనలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రాత్రి వేళ భక్తులను గుంపులుగా పంపిస్తున్నామని, నడకమార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని భక్తులకు టీటీడీ సూచించింది. శేషాచలం అడవులు చిరుతలు, ఎలుగుబంట్లకు అవాసంగా ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే తిరుమలలో చిరుతల సంచారం కొనసాగుతోంది. ఇటీవల మొదటి ఘాట్లో ఎలిఫెంట్ ఆర్చి దగ్గర చిరుత ప్రత్యక్షమైంది. ట్రాప్ కెమెరాలకు చిరుత దృశ్యాలు చిక్కాయి. అటు తిరుమల స్పెషల్ టైప్ కాటేజీల దగ్గర ఎలుగుబంటి సంచారం కనిపించింది. వీటిని బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు. ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు నుంచి తెప్పించిన ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. కాగా చిరుతల సంచారం నేపథ్యంలో తిరుపతి అలిపిరి నడకమార్గంలో భక్తుల రద్దీ తగ్గుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa