ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని.. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకోవాలన్నారు. ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పని తీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంత సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం కింద నెలకు రూ.5 వేల వరకూ జీవన భృతి ఇస్తున్నామన్నారు. రోగికి అందించే ఈ సాయాన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఇవ్వాలని ఆదేశించారు. దీనికి కావాల్సిన ఎస్ఓపీని రూపొందించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యశ్రీ సేవలను ఎలా పొందాలనే అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఆరోగ్యశ్రీ సమాచారాన్ని అందించాలన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి రూ.5 లక్షలు లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేస్తున్నామన్నారు. రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వైద్య సేవలను పొందటంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఆదేశించారు.
గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కేవలం 1,059 ప్రొసీజర్ ఉంటే.. ఇప్పుడు ప్రొసీజర్లను ఏకంగా 3,257కు పెంచామన్నారు సీఎం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ప్రతి ప్రొసీజర్స్ను పథకంలోకి తెచ్చామని.. నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను గణనీయంగా పెంచి హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై సంపూర్ణ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడమే కాకుండా సమర్థంగా సేవలు అందుకునేలా చూడాలన్నారు.
మరోవైపు 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుపైనా సమీక్ష చేశారు. నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభమైన నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం కొత్త కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు మంచి స్పందన వచ్చిందన్నారు. 2025–26లో మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నామన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థంగా ఉండాలి అన్నారు. ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలకుగాను ప్రభుత్వం నుంచి వెళ్లే నిధులు ఆయా ఆస్పత్రుల నిర్వహణకు వినియోగించేలా ఒక పద్ధతి తీసుకురావాలన్నారు సీఎం జగన్.
ఒకవేళ ఆరోగ్యశ్రీ సేవలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా, లంచాల ప్రస్తావన వచ్చినా వెంటనే ఫిర్యాదు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. నెట్వర్క్ ఆస్పత్రులు ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని.. విలేజ్ క్లినిక్స్, సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఈ శిబిరాలు అమలు జరిగేలా చూడాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa