ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో దాదాపు 12 ఏళ్ల ఆయుష్షు తగ్గిస్తోన్న కాలుష్యం,,,,హెచ్చరించిన చికాగో యూనివర్సిటీ అధ్యయనం

national |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2023, 08:53 PM

వాయు కాలుష్యంతో భారతీయుల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతుందని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే ఢిల్లీ ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ విడుదల చేసిన ‘వాయునాణ్యత జీవన సూచీ (ఏక్యూఎల్‌ఐ)’ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే భారత్ కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.


భారత్‌లోని 67.4 శాతం మంది ప్రజలు అధిక కాలుష్య స్థాయిలున్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని తాజా నివేదిక తెలిపింది. ముఖ్యంగా పీఎం 2.5 (అతిసూక్ష్మ ధూళి కణాల కాలుష్యం) కారణంగా భారత ప్రజల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతోందని వివరించింది. ప్రపంచంలోనే ఢిల్లీ అత్యంత కాలుష్య నగరమని.. అక్కడ ఏక్యూఎల్‌ఐను డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉందని చెప్పింది. అక్కడ 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని పేర్కొంది. పరిసర గాలి నాణ్యత ప్రమాణాలు (40 µg/m3) మెరుగుపడకపోతే సగటు భారతీయులు 1.8 ఏళ్లు, ఢిల్లీవాసులు 8.5 ఏళ్లు ఆయుష్షును కోల్పోవచ్చని వివరించింది. గురుగ్రామ్‌లో 11.2 ఏళ్లు, ఫరీదాబాద్‌లో 10.8 ఏళ్లు, జున్‌పూర్ (యూపీ)లో 10.1 ఏళ్లు, లక్నో, కాన్పూర్‌లో 9.7 ఏళ్లు, ముజఫర్‌పూర్ (బిహార్) 9.2 ఏళ్లు, ప్రయాగ్‌రాజ్ 8.8 ఏళ్లు, పట్నా 8.7 ఏళ్లు ఆయుర్దాయం తగ్గిపోనుందని తెలిపింది.


అత్యంత తక్కువ కాలుష్యమున్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో పీఎం 2.5 డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక్కడి ప్రజల జీవితం కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని అంచనా వేసింది. బంగ్లాదేశ్‌, భారత్‌, పాకిస్థాన్‌, చైనా, నైజీరియా, ఇండోనేసియాల్లోని ప్రజలు ఒకటి నుంచి ఆరేళ్లకుపైగా తమ జీవితకాలాన్ని కోల్పోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం కార్డియోవాస్కులర్ వ్యాధులతో దేశంలో మానవ ఆరోగ్యానికి కాలుష్యం గొప్ప ముప్పుగా భావిస్తున్నారు. దీనివల్ల సగటు ఆయుర్దాయం సుమారు 4.5 సంవత్సరాలు తగ్గుతుంది. తరువాత స్థానంలో పోషకాహారలోపం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం మానవ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన ప్రమాదంగా మారింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం సగటు ఆయుర్దాయం 2.3 సంవత్సరాలు తగ్గుతుంది. అయితే, భౌగోళిక, వాతావరణ కారకాలను పరిగణనలోకి తీసుకుని నిర్దిష్ట జాతీయ పరిసర వాయు నాణ్యత ప్రమాణాలను మెరుగుపరిస్తే ఈ గణాంకాలు మారుతూ ఉంటాయి. ప్రపంచ ఆయుర్దాయంపై పీఎం 2.5 ప్రభావం ధూమపానంతో పోల్చవచ్చు. మద్యం వినియోగం, అసురక్షిత నీటి కంటే మూడు రెట్లు ఎక్కువ. రోడ్డు ప్రమాదాల కంటే 5 రెట్లు, హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ కంటే 7 రెట్లు ఎక్కువని ఈపీఐసీ నివేదిక పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa