తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 12న (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సెప్టెంబరు 12న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా సెప్టెంబరు 11న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు.. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది టీటీడీ. అంతేకాదు సంప్రోక్షణ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల సమయంలో వచ్చే మంగళవారం ఆలయ సంప్రోక్షణ చేస్తారు.
దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ సమృద్ధిగా వర్షాలు కురవాలని.. ప్రజలందరికీ మంచి జరగాలనే సత్సంకల్పంతో శ్రీనివాస అష్టోత్తర శతకుండాత్మక మహాశాంతి వరుణయాగం తలపెట్టామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద మహాశాంతి వరుణయాగంలో భాగంగా ఉదయం ఆచార్య రుత్విక్ వరణం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్, ఈవో ఏవీ ధర్మారెడ్డి కలిసి అర్చకులకు పసుపు వస్త్రాలను బహూకరించారు.
అంకురార్పణ నిర్వహించి ఈ నెల 11వరకు ఇక్కడ యాగం నిర్వహిస్తామని చెప్పారు. నెల క్రితం తిరుమల ధర్మగిరిలో నిర్వహించిన వరుణయాగం వల్ల వర్షాలు బాగా కురిశాయన్నారు. ఈ సంవత్సరంతో పాటు, వచ్చే సంవత్సరం కూడా తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న వాతావరణ నిపుణుల సూచనల నేపథ్యంలో ప్రజల క్షేమం కోసం, వారికి సౌభాగ్యం కలగాలని కోరుకుంటూ టీటీడీ ఈ యాగాన్ని నిర్వహిస్తోందని వివరించారు. ఈ యాగం ఎంతో కష్టసాధ్యమైందని, ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పారు. గతంలో ఎన్నడూ ఈ తరహాలో యాగం జరగలేదని తెలిపారు. మూడు రాష్ట్రాల నుంచి అర్చకులు, దాదాపు 60 మందికి పైగా వైఖానస ప్రముఖులు, 30 మందికి పైగా వేద పండితులు, 215 మందికి పైగా రుత్వికులు ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ యాగం వల్ల పరిపూర్ణంగా వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఉందన్నారు. అలిపిరి నడకదారిన వెళ్లే భక్తులకు కర్రలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభినట్టే, త్వరలో చంద్రగిరి సమీపంలోని శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకు చేతి కర్రలు ఇస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa