ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిజర్వేషన్ల అంశంపై రగులుతోన్న మహారాష్ట్ర,,,మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌కు చేదు అనుభవం

national |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 08:22 PM

తనను కలవడానికి వచ్చిన ప్రజలతో ఓ మంత్రి మాట్లాడుతుండగా.. ఊహించని విధంగా ఓ వ్యక్తి తన జేబులో నుంచి పసుపు తీసి ఆయన తలపై పోశాడు. ఈ హఠాత్పరిణామానికి మంత్రి ఖంగుతిన్నారు. ఈ చేదు అనుభవం మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌‌కు ఎదురైంది. సోలాపుర్‌లోని ప్రభుత్వ రెస్ట్‌ హౌస్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిజర్వేషన్ల అంశంపై ఆ వర్గానికి చెందిన కొంత మంది మంత్రి విఖే పాటిల్‌ను కలుసుకున్నారు.


ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మంత్రికి వినతిపత్రం అందజేయగా.. దానిని ఆయన చదువుతున్నారు. మంత్రి పక్కన నిలబడిన వారిలో ఒకరు తన జేబు నుంచి పసుపు ప్యాకెట్ తీసి.. పాటిల్‌ తలపై చల్లాడు. ఈ పరిణామానికి హతాశుడైన మంత్రి వారికి దూరం జరిగారు. ఈ చర్యతో మంత్రి అనుచరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతడ్ని పట్టుకుని ఈడ్చికెళ్లి.. కిందపడేసి పిడిగుద్దులు కురిపించారు. వాళ్లతో తన్నులు తింటూ కూడా ఆ వ్యక్తి రిజర్వేషన్ల గురించి తన డిమాండ్ వినిపించాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కూడా వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.


మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తిని శేఖర్ బంగలేగా గుర్తించారు. ఈ ఘటన అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. తమ సామాజిక వర్గం ఎదుర్కొంటోన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే అలా చేయాల్సి వచ్చిందన్నాడు. తమను ఎస్టీల్లో చేర్చాలని అతడు డిమాండ్ చేశాడు. అంతేకాదు, ఒకవేళ మా డిమాండ్‌ను అంగీకరించపోతే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులపై నల్లరంగు పోస్తామని హెచ్చరించాడు. మరోవైపు, ఈ ఘటనపై మంత్రి స్పందించారు. పసుపు శుభానికి సంకేతమని, అందులో తనకు ఏ తప్పూ కనిపించలేదని అన్నారు. అలాగే నిరసనకారులపై ఎలాంటి చర్యలకు ఆదేశించలేదని చెప్పారు. పార్టీ కార్యకర్తలు అతడ్ని ఎందుకు కొట్టారని ప్రశ్నించగా.. ఏం జరిగిందో ఆ క్షణంలో ఎవరికీ అర్థం కాలేదని, సహజంగా వారు స్పందించి ఉంటారని పాటిల్ అన్నారు. ఆ వ్యక్తిని వెంబడించొద్దని పార్టీ కార్యకర్తలను కోరినట్లు చెప్పారు. మహారాష్ట్రలో రాజకీయంగా బలమైన సామాజిక వర్గంగా ఉన్న మరాఠాలకు కల్పించిన రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో వారు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్‌కు దిగడంతో.. ఓ సర్పంచ్ రూ.30 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన తను కారును తగులుబెట్టిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa