పెరుగుతున్న అవసరాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా రవాణా వ్యవస్థలోనూ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా సామాన్యులు ఎక్కువగా ప్రయాణించే రైళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పొగ బండ్ల ప్రయాణం నుంచి త్వరలో అందుబాటులోకి రానున్న హై స్పీడ్ రైళ్ల వరకు భారతీయ రైల్వేల చరిత్ర సుదీర్ఘమైంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా క్రమంగా అందుబాటులోకి వస్తున్న వందే భారత్ రైళ్ల పట్ల ప్రయాణికుల నుంచి తీవ్ర సానుకూల ప్రభావం వస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న హై స్పీడ్ రైళ్లు కూడా త్వరలోనే రానున్నాయి. తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. హై స్పీడ్ రైళ్ల సర్వీసుల గురించి కీలక ప్రకటన చేశారు.
దేశంలో తొలి హైస్పీడ్ ట్రైన్ మరో ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సనంద్ రైల్వే స్టేషన్ మధ్య ఈ తొలి హై స్పీడ్ రైలు ప్రయాణించనున్నట్లు రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు. శనివారం గుజరాత్లోని సనంద్లో సెమీ కండక్టర్ కంపెనీ మైక్రాన్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన అశ్వినీ వైష్ణవ్.. హై స్పీడ్ రైలు ప్రారంభం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ స్టేషన్లో వందే భారత్ రైళ్లు కూడా ఆగుతాయని ఆయన స్పష్టం చేశారు. అహ్మదాబాద్-సనంద్ రైల్వే స్టేషన్ల మధ్య అంతర్జాతీయ స్థాయి రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో భారత్లో తొలి హై స్పీడ్ ట్రైన్ పట్టాలు ఎక్కనుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సెమీ కండక్టర్ల రంగం గురించి ప్రస్తావించారు. వచ్చే కొన్నేళ్లలో సెమీ కండక్టర్ల డిమాండ్ రూ.5 లక్షల కోట్ల మార్కెట్ పెరుగుతుందని తెలిపారు. సెమీ కండక్టర్ల రంగంలో గుజరాత్ రాష్ట్రం తొలి వరుసలో నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. సెమీ కండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ ప్లాంట్ను గుజరాత్లో ఏర్పాటు చేస్తామని మైక్రాన్ సంస్థ ఈ ఏడాది జూన్లో ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికాకు చెందిన మైక్రాన్ కంపెనీ రూ.22,140 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే 2019 ఫిబ్రవరి 15 వ తేదీన దేశంలో తొలి వందే భారత్ రైలు ప్రారంభం అయింది. అప్పటి నుంచి క్రమంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో సాధారణ రైళ్ల కంటే ఎక్కువ వేగంతో ఈ వందే భారత్ రైళ్లు పట్టాలపై దూసుకెళ్తున్నాయి. అయితే ఇందులో స్లీపర్ బెర్తులను ఇప్పటివరకు అందుబాటులో లేకపోగా.. త్వరలోనే తీసుకువస్తామని కేంద్రం ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa