అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇస్కాన్)పై బీజేపీ ఎంపీ మేనకా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన గోశాలలోని ఆవులను కసాయిలకు అమ్ముకుంటోన్న ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసకారి అని మేనకా గాంధీ విమర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన కృష్ణుడి శాఖ అయిన ఇస్కాన్.. మాజీ కేంద్ర మంత్రి చేసిన ఆరోపణలపై ఇంకా స్పందించలేదు. జంతు హక్కుల కార్యకర్త అయిన మేనకా గాంధీ.. జంతు సంరక్షణ సమస్యలపై సోషల్ మీడియా వేదికగా తన గళం విప్పుతున్నారు.
‘ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద చీటర్.. గోశాలల ఏర్పాటుకు భూమి, నిర్వహణ సహా ప్రభుత్వం నుంచి లబ్దిపొందుతోంది’ అని మేనకా గాంధీ ఆరోపించారు. ఆమె ఆరోపణలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ఇస్కాన్ పర్యటనను ఆమె గుర్తుచేసుకున్నారు. అనంతపురం ఇస్కాన్ గోశాలలో పాలిచ్చిన ఆవులు లేదా దూడలను తాను చూడలేదన్నారు. ‘డెయిరీ మొత్తంలో ఎండిపోయిన ఆవు లేదు.. అక్కడ ఒక్క దూడ కూడా లేదు. అంటే అన్నీ అమ్ముడయ్యాయి’ అని మేనకా గాంధీ దుయ్యబట్టారు. ‘తన వద్ద ఉన్న మొత్తం గోవులను కసాయిలకు ఇస్కాన్ అమ్మేస్తోంది.. వారు చేసినంతగా మరెవరూ చేయరు. మళ్లీ రోడ్లపై ‘హరే రామ్ హరే కృష్ణ’ అని పాడతారు. అప్పుడు తమ జీవితమంతా పాలపైనే ఆధారపడి ఉంటుందని చెబుతారు.. బహుశా కసాయిదారులకు వీళ్లు అమ్మినంతగా పశువులను ఎవరూ అమ్మి ఉండరు’ అని ఆమె ఆరోపణలు చేశారు. హరే కృష్ణ ఉద్యమంలో అనుబంధమైన ఇస్కాన్కు ప్రపంచవ్యాప్తంగా వందలాది దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై కొన్ని నెలల కిందట విమర్శలు చేసి ఇస్కాన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అమోఘ్ లీలా దాస్ వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీయడంతో ఆయన నిషేధించి తప్పుదిద్దుకునే ప్రయత్నం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa