ఏపీలో ఎన్నికలకు సంబందించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 ప్రక్రియతో సంబంధమున్న అధికారులెవరినీ ఈ నెల 27 నుంచి 2024 జనవరి 5 వరకూ తమ అనుమతి లేకుండా బదిలీ చేయటానికి వీల్లేదని ఆదేశించింది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కలెక్టర్లు, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా వ్యవహరిస్తున్న సబ్కలెక్టర్లు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అదనపు మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.
అలాగే అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా ఉన్న తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సూపర్వైజర్లు, వీఆర్వోలు/వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. అలాగే బీఎల్వోలుగా బాధ్యతలు నిర్వర్తించే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇతర ఉద్యోగులను ప్రస్తుతం వారు పనిచేస్తున్న స్థానాలనుంచి కదిలించొద్దని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో సంబంధమున్న పోస్టుల్లో ఏవైనా ఖాళీగా ఉంటే ఈ నెల 10లోగా భర్తీ చేసి ఆ వివరాలు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా ఉత్తర్వులు ఇచ్చారు.
తుది ఓటర్ల జాబితా-2024 రూపొందే వరకు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను బదిలీ చేయాలన్నా.. నియామకాలు చేపట్టాలన్నా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫొటో ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ-2024 కొనసాగుతున్నందున.. ఎన్నికల ప్రక్రియలో ఉన్న కీలక అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే వారిలో ఏఈఆర్వో, బీఎల్వో సహా దిగువ స్థాయి అధికారుల బదిలీల వ్యవహారాన్ని సీఈవో స్థాయిలో నిర్ణయించవచ్చు.
ఈ నెల 10వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది, ఖాళీల భర్తీ వివరాలను సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, ఈఆర్వోలు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సీఈవో ఆదేశాలిచ్చారు. ఖాళీలన్నీ అప్పటిలోగా భర్తీ చేయాలని.. భర్తీ చేయని ఉద్యోగుల వివరాలను 15వ తేదీ నాటికి తెలియజేయాలి అన్నారు. ఒకవేళ ఓట్ల జాబితా సవరణ ప్రకియలో ఉన్న అధికారులు సెలవుపై వెళ్లాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనికి విరుద్ధంగా జరిగితే సదరు ఉన్నతాధికారులపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అని ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. ఈ నెల 27 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా.. అదే విధంగా 2024 జనవరి 5 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తాము అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa