డయాబెటిస్తో బాధపడుతున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. భర్తతో కలిసి విమానం ఎక్కిన ఆమె పట్ల సిబ్బంది దారుణంగా వ్యవహరించారు. ఆమె కొంత అసౌకర్యంగా కనిపించడంతో బలవంతంగా దింపేశారు. యూకేలోని న్యూకేజిల్ విమానాశ్రయంలో అక్టోబరు 2న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రిటన్కు చెందిన 56 ఏళ్ల మహిళ హేలన్ టేలర్ తన భర్తతో కలసి రోమ్ వెళ్లేందుకు జెట్2 విమానానికి టిక్కెట్ బుక్ చేసుకున్నారు. అక్టోబరు 2న భార్యాభర్తలు న్యూకేజిల్ విమానాశ్రయంలో విమానం ఎక్కారు. టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న టేలర్.. కొంత అసౌకర్యంగా కనిపించారు.
దీంతో క్యాబిన్ సిబ్బంది ఆమెను కిందికి దింపేశారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా మహిళను బలవంతంగా దింపేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. టాయిలెట్కు వెళ్లి తిరిగొచ్చే సమయంలో చెమట పట్టి.. అలసిపోయినట్టుగా అనిపించడంతో సిబ్బంది ఇలా వ్యవహరించినట్టు తెలిసింది. ‘నేను బాగానే ఉన్నాను.. రక్తంలో చక్కెర స్థాయుల్లో మార్పు వచ్చి ఉంటుంది.. కూర్చుని, రిలాక్స్ గా నీరు తాగితే చాలు సర్దుకుంటుంది’ అని చెప్పినప్పటికీ క్యాబిన్ క్రూ సిబ్బంది వినిపించుకోలేదని టేలర్ వాపోయారు.
‘నేను రోజంతా ఆహారం తీసుకోలేదు.. విమానం ఎక్కిన తర్వాత తిన్నాను.. నాకు టైప్ 2 మధుమేహం ఉంది.. కాబట్టి ఇది నా రక్తంలో చక్కెర స్థాయిని మాత్రమే పెంచుతుంది.. కూర్చుని నీరు తాగితే సర్దుకుంటుంది’ ఆమె అన్నారు. నాకు చెమటలు పట్టడంతో ఫ్లైట్ అటెండెంట్ వచ్చి.. ప్రయాణానికి ఇబ్బంది పడుతున్నారా? వైద్యం సాయం తీసుకుంటారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నాకేం కాలేదు.. అంతా బాగానే ఉందని చెప్పారు.. మళ్లీ 10 నిమిషాల తర్వాత వచ్చిన ఆమె.. విమానం నుంచి దింపేయాలని నిర్ణయం తీసుకున్నాం.., మీకు ప్రమాదం ఉందని మేము భావిస్తున్నాం అన్నారు.. మధుమేహం ఉన్నందుకు దింపేస్తారా? నేను ఇప్పుడు అనారోగ్యంగా కనిపిస్తున్నానా? అసలు నాకు ఏ సమస్య లేదని చెప్పినా వినిపించుకోలేదు’ అని బాధితురాలు వివరించారు.
అయితే, మెనోపాజ్ దశ వల్ల ఆమెకు చెమటలు పట్టేసరికి, ఏదో జరుగుతోందని విమానం సిబ్బంది భయపడి బలవంతంగా దింపేశారని ఆరోపించారు. హెల్త్ రిస్క్ ఉందని భావించినప్పుడు కనీసం వైద్యపరమైన సాయం కూడా అందించలేదని దుయ్యబట్టారు. నా జీవితంలో ఇంత హాస్యాస్పదమైన సంఘటనను ఎప్పుడూ ఎదుర్కొలేదు.. ఎలా ట్రీట్ చేశారో నమ్మలేకపోతున్నాను... ఇది పూర్తిగా పిచ్చి పని.. ’ అని మండిపడ్డారు.
ఈ ఘటనపై జెట్2 విమానయాన సంస్థ మరోలా స్పందించింది. ప్రయాణికుల భద్రతే తమకు ప్రధానం అని స్పష్టం చేసింది. వైద్య నిపుణుల సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఏది ఏమైనప్పటికీ దీనిపై లోతైన విచారణ జరిపి.. ఆమెకు మేము క్షమాపణలు చెప్పడానికి, టిక్కెట్ ఖర్చులను తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని జెట్2 అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, ఎవరైనా ప్రయాణికుడి ఆరోగ్యం ప్రమాదంలో ఉందనిపిస్తే సాధారణంగా వారిని ప్రయాణించేందుకు అనుమతించరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa