మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 35వ రోజు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన డీహైడ్రేషన్, చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు భద్రత, ఆరోగ్య విషయంలో నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని జైలు అధికారులు చెబుతున్నారు. స్నేహ బ్యారక్లో చంద్రబాబు ఉన్న గదిలో అధికారులు 8 ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే చికిత్స అందించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ముందు జాగ్రత్త చర్యగా ఒక వీఐపీ రూమును సిద్ధం చేశారు అధికారులు. చంద్రబాబు నెల రోజులు వ్యవధిలో జైల్లో ఒక కిలో బరువు పెరిగారని జైలు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారంటూ రెండో రోజు కూడా జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
మరోవైపు రాజమహేంద్రవరం సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ఉన్న వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా శుక్రవారం అర్ధరాత్రి సిద్ధం చేశారు. దీంతో చంద్రబాబును ఆస్పత్రికి తరలిస్తారనే చర్చ జరిగింది. ఆస్పత్రిలో క్యాజువాలిటీ పక్కనున్న ఆ గది, మార్గం అంతా హడావుడిగా శుభ్రం చేశారు. గదిలో రెండు ఆక్సిజన్ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్, వెంటిలేటర్, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యుడితో పాటు ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, మరో ఇద్దరు స్టాఫ్ నర్సులను కేటాయించారు. ద్రబాబు ఇటీవల డీహైడ్రేషన్, అలర్జీలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం జీజీహెచ్ నుంచి ఇద్దరు చర్మ సంబంధిత వైద్య నిపుణులు ఆయన్ను పరీక్షించి కొన్ని మందులు సూచించారు. దీంతో సీల్డ్ కవర్లో సమగ్ర నివేదిక జైలు ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జైలు అధికారులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై ఆందోళన వద్దని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు స్కిన్కు సంబంధించి పూర్తిగా పరీక్షించామని, ట్రీట్మెంట్పై సూచనలు రాసిచ్చామని రాజమహేంద్రవరం జీజీహెచ్ డాక్టర్లు అంటున్నారు. ప్రీక్లీ హీట్ (చెమట పొక్కులు)లా వచ్చిందని, వైద్యం అంతా జైలులోని మెడికల్ ఆఫీసర్లు చూస్తారని చెప్పారు. సెంట్రల్ జైలు మెడికల్ ఆఫీసర్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ మేరకు హెచ్వోడీ డాక్టర్ సూర్యనారాయణతో కలసి జైలులోకి వెళ్లాం. చంద్రబాబును పరీక్ష చేసి తగిన సూచనలు ఇచ్చామన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో వీఐపీ గదిని ముందస్తు జాగ్రత్తగా సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ వైద్యుల సూచనల మేరకు ఆయన్ను ఆసుపత్రికి తరలించాల్సి వస్తే.. ముందు జాగ్రత్త చర్యగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జైలు అధికారుల నుంచి ఆసుపత్రి ఉన్నతాధికారులకు వచ్చిన ఆదేశాలతో వీఐపీ గదిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అధికారులు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa