ఏపీలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మహిళా సాధికారిత లక్ష్యంగా మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. సొంత కాళ్లపై నిలబడాలనుకునే పేదింటి మహిళలకు చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు కేవలం 10 శాతం ఖర్చుతో వారు ఆటోలు సమకూర్చుకొని.. వాటి ద్వారా ఆర్థికంగా బలపడేలా ‘మహిళా శక్తి’ కార్యక్రమాన్ని రూపొందించారు. సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) పరిధిలో 'ఉన్నతి' కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొందరు మహిళలు ఆటోలను అద్దె ప్రాతిపదికన తీసుకొని నడుపుకొంటున్నారు. ఇకపై వారు అద్దెవి కాకుండా సొంత ఆటోలు నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయం పొందేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు 'మహిళా శక్తి' కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించారు. ఈ పథకంలో ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో పది శాతం లబ్ధిదారు అయిన మహిళ చెల్లించాల్సి ఉంటుంది.. మిగతా 90 శాతం సెర్ప్ ద్వారా ప్రభుత్వమే రుణంగా అందిస్తుంది.. అంతేకాదు తీసుకున్న రుణానికి వడ్డీ కూడా ఉండదు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబరు 6వ తేదీన లబ్ధిదారులకు కొత్త ఆటోలు అందజేస్తారు. మిగిలిన మండలాల్లో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి.. వారికీ అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న కొత్త ఆటోలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలకు తాము తీసుకున్న మొత్తం రుణాన్ని 48 నెలలు కిస్తీ రూపంలో చెల్లించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేయూతను అందిస్తుంది. ఇప్పటికే 229 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసి.. వారికి డ్రైవింగ్లో నాలుగు రోజుల పాటు అదనపు శిక్షణ ఇచ్చారు.. డ్రైవింగ్ సమయంలో భద్రతతో పాటుగా ఆటోలకు వచ్చే చిన్న చిన్న సమస్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ఆటోల కొనుగోలుకు బ్యాంకులు లేదా ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలు రుణాలిస్తాయి. ఈ రుణాన్ని నెలవారీ కిస్తీల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై కనీసం రూ. లక్షన్నర వడ్డీనే అవుతుంది.. ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా భారం అవుతోంది. మహిళా శక్తి ద్వారా ఆటోలు పొందే లబ్ధిదారులకు ఇచ్చే రుణంపై వడ్డీ లేనందున, వారికి ఈ లక్షన్నర ఆర్థిక ప్రయోజనం అదనంగా కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంతో ఎంతో మందికి మేలు జరుగుతుంది అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa